
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
విద్యార్థుల మానసికోల్లాసానికి ‘సమ్మర్ క్యాంపులు’
చేగుంట ఉన్నత
పాఠశాలలో
చిన్నారులు
గీసిన చిత్రాలు
నృత్యం నేర్పుతున్న శిక్షకుడు
చేగుంట(తూప్రాన్): సమ్మర్ క్యాంపులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థుల మానసికోల్లాసం కోసం ప్రభుత్వం యంగ్ ఇండియా సమ్మర్ క్యాంపుల పేరుతో విద్యార్థులకు ప్రతి రోజు మూడు గంటల పాటు సృజనాత్మకతను మెరుగుపర్చే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో మండలానికో పాఠశాల చొప్పున 22 పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల పాటు నిర్వహించే క్యాంపులో విద్యార్థులకు క్రీడలకు సంబంధించి క్యారం, చదరంగం, సృజనాత్మక అభ్యాసనంలో భాగంగా డ్రాయింగ్, కాగితంతో కళాఖండాల తయారీ, శారీరక దృఢత్వం కోసం యోగా, విద్యకు సంబంధించి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, సాంస్కృతిక రంగానికి సంబంధించి నృత్యం, సంగీతం, నాటకాల ప్రదర్శఽనల్లో శిక్షణ కల్పిస్తున్నారు. విద్యార్థులకు అల్పాహారం సైతం అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలలో వంద మంది విద్యార్థులు సమ్మర్ క్యాంపుల్లో శిక్షణ పొందనుండగా, జిల్లాలో 22,000 మంది విద్యార్థులకు క్యాంపులు ఉపయోగకరంగా మారనున్నాయి. సమ్మర్ క్యాంపులతో విద్యార్థుల ఆలోచన శక్తి పెంపొందడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన, సైన్స్ పట్ల ఆసక్తి, ప్రదర్శనలతో నైతిక ధైర్యం పెరగడంతో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందే అవకాశం ఉంది.
శిక్షకుల నియామకం
సమ్మర్ క్యాంపుల్లో భాగంగా విద్యార్థులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి పాఠశాలకు నలుగురు చొప్పున శిక్షకులను నియమించాం. పిల్లల కేవలం పాఠాలే కాకుండా జీవన నైపుణ్యాల్లో ముందుకు సాగేందుకు వేసవి శిబిరాలు ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి.
– నీరజ, ఎంఈఓ, చేగుంట

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా