మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు బోధన, చదువు కొనసాగింపు గుర్తించేందుకు సోమవారం సర్వే మొదలైంది. ఎంపిక చేసిన పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల భాషా, గణిత సామర్థ్యాల అంచనాకు ఈ నెల 30, 31న పరఖ్ జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) పేరిట సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా నాలుగు పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులతో సర్వే ప్రారంభించారు. హాజీపూర్ మండలం నాగారం మండల పరిషత్ పాఠశాల, మంచిర్యాలలో స్ప్రింగ్ ఫీల్డ్ హైస్కూల్, వేమనపల్లి మండలం ముల్కల్పేట, కోటపల్లి మండలం దేవులవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. రెండ్రోజులపాటు ఒక్కో పాఠశాలలో 12 మంది విద్యార్థుల చొప్పున 48 మందిని పరీక్షిస్తారు. దీనిద్వారా విద్యావ్యవస్థపై అంచనా ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో చేపట్టే విద్యా కార్యక్రమాల ప్రణాళికకు సమాచారం దోహదపడుతుందని డీఈవో యాదయ్య తెలిపారు.


