మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్న ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి కళాశాల విద్యాశాఖ అమలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు(ఎఫ్ఆర్ఎస్) ప్రారంభమైంది. విద్యార్థుల హాజరు పర్యవేక్షణకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చింది. కళాశాల హాజరు ప్రక్రియను సులభతరం చేసేందుకు నిర్ణయించింది. డిజిటల్ హాజరు, పారదర్శకత, సులభంగా యాక్సెస్ కానుంది. విద్యార్థుల హాజరు పరిశీలించడానికి, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ఎఫ్ఆర్ఎస్ హాజరు దోహదం చేయనుంది. అధునాతన సాంకేతిక టెక్నాలజీ (ఏఐ) ఉపయోగించి విద్యార్థులను నమో దు చేస్తున్నారు. మొదట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్తో విద్యార్థుల హాజరు నమోదు చేసిన తర్వాత ప్రైవేటులోనూ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
అమలుతో..
డిగ్రీ విద్యార్థులు నిజంగా తరగతులకు వచ్చే వారెందరో ఇట్టే తెలిసిపోనుంది. మాన్యువల్ అటెండెన్స్ తీసే అవసరం ఉండదు. టీచర్లు బోధనపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అనధికార వ్యక్తుల ప్రవేశం తగ్గుతుంది. విద్యార్థులు సక్రమంగా రావాల్సి ఉంటుంది. 75శాతం హాజరు ఉంటేనే విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంటుకు అవకాశం ఉటుంది. లేదంటే బీకాం విద్యార్థులు రూ.6,300, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ విద్యార్థులు రూ.4,350, బీఏ విద్యార్థులు రూ.3,350 చెల్లించాల్సి ఉంటుంది. హాజరు శాతం(75శాతం కంటే) ఏమాత్రం తగ్గినా ప్రైవేట్ డిగ్రీ విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తే ఫీజులు కోర్సును బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు, హాజరు ప్రక్రియ సాగుతోంది. వచ్చే వి ద్యాసంవత్సరం నుంచి పకడ్బందీగా అమలు కానుంది.
విద్యార్థులు ఇలా..
కళాశాల ప్రథమ ద్వితీయ తృతీయ
మంచిర్యాల 196 115 106
చెన్నూర్ 231 146 144
లక్సెట్టిపేట 246 356 434
బెల్లంపల్లి 202 239 186
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో..
ప్రయోగాత్మకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు చేసి తర్వాత ప్రైవేట్లో ముఖ ఆధారిత హాజరు ప్రవేశ పెట్టనున్నారు. జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాలలో 417 మంది విద్యార్థులు, చెన్నూర్లో 521మంది, బెల్లంపల్లిలో 627 మంది, లక్సెట్టిపేటలో 1038మంది ఉన్నారు. వీరందరికి ఎఫ్ఆర్ఎస్ అమలు చేయనున్నారు.


