చెన్నూర్: జిల్లాలో గోదావరి నది పుష్కరాల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.500 కోట్లు కేటాయించింది. జిల్లాలో వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు పుష్కర పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే చెన్నూర్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పుష్కరఘాట్లు, వాహనాల పార్కింగ్, పోలీ సు కంట్రోల్ రూమ్లు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే షెడ్లు, వీఐపీ పార్కింగ్ కోసం డీపీఆర్ సిద్ధమైంది. భక్తుల సౌకర్యార్థం రోడ్లు, ఇతర ఏర్పాట్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతోపాటు జిల్లాలో జరిగే పుష్కరాల కోసం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
నదికి ప్రాముఖ్యత
చెన్నూర్ గోదావరి నది పుష్కరాలకు ప్రాముఖ్యత ఉంది. గోదావరి నది కాశీ అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాశీలోని గంగానది ఉత్తర దిశగా రెండు మైళ్లు ప్రవహిస్తుంది. చెన్నూర్ గోదావరి ఉత్తర దిశగా ఐదు మైళ్లు ప్రవహిస్తుండడంతో పంచక్రోశ ఉత్తరవాహిని నదిగా పేరుంది. చెన్నూర్ గోదావరి నదిలో పిండ ప్రదా నాలు చేస్తే కాశీ నదిలో చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పుష్కర స్నానాలు ఆచరణకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తోపాటు కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత పుష్కరాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఆ సమయంలో జాతీయ రహదారి లేకపోవడంతోపాటు సిరోంచ ప్రాణహిత నది వంతెన పూర్తి కాలేదు. అయినప్పటికీ సుమారు 80 వేల నుంచి లక్షా మంది భక్తులు వచ్చినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలోనే లక్షా మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. చెన్నూర్ నియోజకవర్గంలోనే 2 లక్షల పైగా జనాభా ఉంది. ప్రస్తుతం జాతీయ రహదారితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది చెన్నూర్ గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెన్నూర్తోపాటు మండలంలోని సుందరశాల, జైపూర్, మందమర్రి, మంచిర్యాల గోదావ రి నదులతో కలిసి సుమారు జిల్లాలో పది లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశాలు లేకపోలేదు. అధికార యంత్రాంగం రానున్న పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.


