మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే జవాబు పత్రాలు మూల్యాంకనానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. సీబీఎస్ఈ తరహాలో పరీక్షల నిర్వహణతో ఎనిమిది పేపర్ల పరీక్షలు 33 రోజుల వ్యవధిలో పూర్తి కానున్నాయి. అయినప్పటికీ పరీక్ష ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. పరీక్షలు పూర్తయ్యే నాటికి మూల్యాంకనం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28నుంచి కోడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ ఒకటి నుంచి 23వరకు మంచిర్యాలలోని కార్మెల్ హైస్కూల్ వేదికగా మూల్యాంకనం చేస్తారు. ఈ కేంద్రాన్ని పరీక్షల విభాగం సహాయ కమిషనర్ మల్లేశంతో కలిసి డీఈవో యాదయ్య బుధవారం పరిశీలించారు.
జిల్లాకు చేరిక..
ఇతర జిల్లాల నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు జిల్లాకు చేరుతున్నాయి. గతేడాది 1.20లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయగా ఈ ఏడాది ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ బెండలు జిల్లాకు వచ్చాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాలు వస్తేనే పూర్తి లెక్క తేలనుంది. పటిష్టమైన భద్రత మధ్య ఏడు సబ్జెక్టుల్లో ఐదు సబ్జెక్టులకు సంబంధించిన కోడింగ్ ప్రక్రి య, స్పాట్ వాల్యూయేషన్ చర్యలు చేపట్టారు..
మూడు దఫాల్లో..
ఏప్రిల్ ఒకటి నుంచి 23 వరకు ఉపాధ్యాయులు జవాబుపత్రాలు దిద్దనున్నారు. ఈ ఏడాది మూడు దఫాల్లో మూల్యాంకనం చేయనున్నారు. మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి 9వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, రెండో విడత 10 నుంచి 17వరకు ఫిజికల్సైన్స్, బయోసైన్స్, మూడో విడత ఏప్రిల్ 17నుంచి 23వరకు సోషల్ సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకనం సాగనుంది. అవసరమైన ఆయా సబ్జెక్టుల వారీగా టీచర్లకు విధులు కేటాయించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టారు. జిల్లాకు చేరిన జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్లో రూమ్లో భద్రపర్చారు.


