పోటీకి దిగుతున్న లీడర్లు
రిజర్వేషన్లు కుదిరిన చోట్ల ఆశావహులు రెడీ తను, లేకపోతే కుటుంబాల నుంచి బరిలోకి.. ఒక్కోచోట ఐదుగురు కంటే అధికంగానే.. నేటి నుంచి తొలి విడత నామినేషన్ల పర్వం షురూ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే నాయకులు బిజీగా మారారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. తొలి విడతలో జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలోని 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు, మూడో దశ ఎన్నికలతో పోలిస్తే మొదటి విడతలో పోటీ చేసే నాయకులకు గడువు లేకుండా పోయింది. దీంతో పోటీ చేయాలనుకునే నాయకులు బరిలోకి దిగేందుకు సన్నద్ధం అయ్యారు. ఆయా చోట్ల పోటీ చేసేవారంతా సర్పంచ్లుగా గెలిచి తమ పార్టీ బలం చూపేందుకు సిద్ధమయ్యారు. జనరల్, మహిళా స్థానాల్లో అధిక పోటీ నెలకొంది. కొన్ని చోట్ల ఎస్సీ రిజర్వు స్థానాల్లోనూ సర్పంచ్ కావాలని ఎన్నికల్లో నిలబడేందుకు సిద్ధమయ్యారు. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలు, రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న గ్రామాల్లో పోటీ పెరిగే అవకాశం ఉంది.
పల్లెల్లో పట్టు కోసం..
అధికార కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులే గెలిచేలా నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. పోటీ జరిగే స్థానాలు అధిక జనాభా, ఓటర్లు ఉన్న స్థానాలు, తమకు పూర్వం నుంచి బలం ఉన్న గ్రామాల్లో ఆశావహుల పేర్లతో జాబితా సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల పరిధిలో నాయకులు, కేడర్ను సన్నద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు అనారోగ్యం కారణంగా ఆయన అనుచరులు, నాయకులు కార్యకర్తలే వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. బీజేపీలో ఆ పార్టీ నాయకులు వెరబెల్లి రఘునాథ్రావు ఈ మేరకు గ్రామాల్లో పర్యటిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల తర్వాత పరిషత్, ఆపై మున్సిపాలిటీల ఎన్నికలు జరగనున్న తరుణంలో గ్రామ స్థాయి నుంచి స్థానిక సంస్థల్లో అధిక స్థానాలు గెలిచి జిల్లాలో పట్టు పెంచుకునేందుకు బలమైన అభ్యర్థులను పోటీలో దింపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రజాబలంతోపాటు ఆర్థికంగా ఖర్చును తట్టుకునే అభ్యర్థులను రంగంలోకి దింపి పోటీ చేయించి, వీలైనన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని సిద్ధమయ్యారు.
తొలి విడత ఎన్నికలు జరిగే మండలాలు
దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట
గ్రామ పంచాయతీలు 90
వార్డులు 816
గ్రామాల్లో సర్పంచ్గా ఎన్నిక కావాలని ఆశ పడుతున్న నాయకులంతా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో స్థానానికి కనీసం ఐదు కంటే అధికంగానే నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. జనరల్ స్థానాలతోపాటు మహిళా, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమకు కలిసి రాని చోట తమ సతీమణులు, కుటుంబ సభ్యులను పోటీకి నిలబెడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వస్తాయో రావో, మరోవైపు పార్టీ గుర్తు కావడంతో బీ ఫాం ఇస్తారో లేదో అనే ముందస్తు వ్యూహంతో మొదట సర్పంచ్ స్థానానికి పోటీ చేసి తమ బలాన్ని తెలుసుకునేందుకు ఆరాట పడుతున్నారు. ఇందుకోసం అన్ని వనరులు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఖర్చు కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారు.
పోటీకి దిగుతున్న లీడర్లు


