పెట్టుబడి కోసం రైతుల ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి కోసం రైతుల ఎదురుచూపులు

May 31 2025 1:24 AM | Updated on May 31 2025 3:18 PM

ముందస్తు వర్షాలతో పొలంబాట

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు తండ్లాట

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ముందస్తు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు ప్రభుత్వం అందించే రైతుభరోసా పథకం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా పెట్టుబడికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. గత వర్షాకాలం సీజన్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్‌లో అయినా సాగుకు ముందు సాయం అందించాలని కోరుతున్నారు. వారం రోజులుగా అకాల వర్షాలు, నైరుతి రుతుపవనాల రాకతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. దీంతో రైతులు పొలం బాట పట్టారు. 

గత ఖరీఫ్‌, రబీ పంటల మొదళ్లు, వేర్లు తొలగిస్తూ చెత్తాచెదారం కాల్చి వేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నిన రైతులు దౌర కొడుతూ చేను సారవంతం చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వర్షాకాలంలో 3.33 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, వరిపంటలు సాగు కానున్నాయి. ఏటా తొలకరి వర్షాలు ఆలస్యంగా కురువడంతో జూన్‌ నెలాఖరులో పత్తి విత్తనాలు వేయడం, వరి నారు పోయడం చేస్తుంటారు. ఈసారి ముందుగానే వర్షాలు రావడంతో ఏరువాక పున్నంకు విత్తుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

విడతల వారీగా..

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం ఎకరానికి రూ.5వేలు చొ ప్పున అందించగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరో సా పథకం పేరుతో ఎకరానికి రూ.6వేలు చొప్పున గత యాసంగి నుంచి అందిస్తోంది. జనవరి నుంచి మార్చి వరకు ఎకరాలోపు, ఆ తర్వాత రెండు, మూ డు, నాలుగు, ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో విడతల వారీగా నగదు జమ చేసింది. యాసంగి పంటలు దిగుబడి వచ్చే సమయం వరకు నగదు జమ చేస్తూ వచ్చింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనైనా సాగు సమయానికి నగదు అందితే ఎంతో మేలు చేకూరుతుందని రైతులు ఆశిస్తున్నారు.

గత వానాకాలం అందని వైనం..

2018 నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం ప్రారంభించి ఎకరానికి రూ.4వేల చొప్పున ఆ తర్వాత 2019 నుంచి రూ.5వేల చొప్పున అందించింది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇందులో చెరువులు, గుట్టలు, రియల్‌ వెంచర్లు, రోడ్లు, ప్రా జెక్టు ముంపు పరిహారం భూములకు సైతం రైతుబంధు నగదు జమ చేసి దుర్వినియోగం చేసిందని, తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రైతు భరో సాగా మార్చి ఎకరానికి రెండు సీజన్లకు రూ.15వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. 

అధికారంలోకి వచ్చిన తర్వాత 2023–24 యాసంగి సీజన్‌లో ఎకరాకు రూ.5వేల సాయం అందించి గత వానాకాలం నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పినా అమలు చేయలేదు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో అనేక తప్పిదాలు ఉన్నాయని, అనర్హులకు సాయం అందుతోందని పారదర్శకంగా సాగులో ఉన్న భూమికే ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, అధికారులతో కలిసి జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. దీంతోపాటు గత వానాకాలం సాగు చేసిన పంటలను ప్రామాణికంగా తీసుకుని తిరిగి ల్యాండ్‌ యుటిలైజేషన్‌ సర్వే ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పేరిట సర్వే చేశారు. దీనికి అనుగుణంగా యాసంగి సీజన్‌ నుంచి ఎకరాలతో పరిమితి విధించకుండా సాగు భూములకే రైతుభరోసా అమలు చేస్తోంది.

ఐదెకరాల్లోపే..

యాసంగి సీజన్‌ నవంబర్‌, డిసెంబర్‌లో ప్రారంభం కాగా రైతుభరోసా పథకం జనవరి 27నుంచి ప్రారంభించింది. జిల్లాలో మండలానికో గ్రామం ఎంపిక చేసి ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో రైతు భరోసా పథకానికి అర్హులైన 1,51,363మంది రైతులు ఉండగా గత రబీలో జనవరిలో 1,15,868 మంది రైతులకు రూ.91,10,39,713 మాత్రమే జమ చేసింది. మొదట ఎంపిక చేసిన గ్రామాల్లో ఎకరాలతో సంబంధం లేకుండా ఒక రైతుకు సాగు భూమి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుభరోసా నగదు అందించింది. మిగతా రైతులకు జనవరి నెలాఖరు నుంచి మార్చి వరకు ఎకరాల వారీగా విడతల్లో జమ చేసింది. అదీ ఐదెకరాల్లోపే నగదు జమ అయినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ వానాకాలంలో అయినా ఆలస్యం చేయకుండా ఐదు ఎకరాల్లోపు ఉన్న వారికి ఒకేసారి అందించాలని కోరుతున్నారు.

ఈసారైనా వస్తుందో..లేదో..

పోయిన వానాకాలం ఎవరికీ రైతుభరోసా ఇవ్వలేదు. యాసంగి లో ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతుభరోసా పైసలు పడ్డయి. నా పేరు మీద 4.30 ఎకరాల సాగు భూమి ఉంది. ఖరీఫ్‌లో పత్తి, వరి, యాసంగిలో వరి పంట సాగు చేసుకుంటున్న. అయి న నాకు మాత్రం పడలేదు. ఏ లెక్కన వేస్తున్నారో ఏమో ఈసారైనా పడుతాయో లేదు.

– బొమ్మిని శ్రీనివాస్‌, గ్రామం : కుందారం, మం: జైపూర్‌

ఆలస్యం చేయకుండా ఇవ్వాలి

ఈ ఏడాది వానాకా లం ముందే వచ్చిన ట్లు ఉన్నది. ఏటా పంటలు వేసుకోవ డం లేటు అవుతుంది. పత్తి వేసుకునేందుకు దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న. ప్రభుత్వం రైతుభరోసా సాయం అందిస్తే విత్తనా లు, ఎరువులు కొనుగోలుకు ఇబ్బంది ఉండ దు ఆలస్యం చేయకుండా రైతుభరోసా వేయాలి.

– బి.మల్లేష్‌, నెన్నెల

పెట్టుబడి కోసం రైతుల ఎదురుచూపులు1
1/1

పెట్టుబడి కోసం రైతుల ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement