
నేడు ఎమ్మెల్సీ కవిత రాక
శ్రీరాంపూర్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్లోని సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం జాగృతి కార్యకర్తలు తీగల్పహడ్లోని కందుల ప్రశాంత్, నస్పూర్ తోళ్లవాగు సమీపంలో శశి ఇళ్లకు వెళ్తారు. గౌతమినగర్లో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ జర్నలిస్టు మునీర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. లక్షెట్టిపేట పట్టణంలో జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిశా ఇంటికి వెళ్తారు. ఈ పర్యటనల కోసం ఆమె అనుచరులు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ఆమె ఇటీవల సంచలన ప్రకటనలు చేసి నేపథ్యంలో నేటి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా సింగరేణిలో ప్రత్యేక సింగరేణి జాగృతి కమిటీలు ప్రకటించిన తర్వా త మొదటిసారిగా వస్తున్న ఆమెకు గులాబీ శ్రేణులు స్వాగతం పలుకుతారా లేదా అనే స్పష్టత లేదు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె సింగరేణికి వస్తున్నా నాయకులకు సమాచారం లేదని తెలిసింది.
రాజకీయ వ్యవహారాల కమిటీలో పీఎస్సార్
మంచిర్యాలటౌన్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో ఏర్పాటు చేసిన పలు కమిటీలను అధిష్టానం ఆమోదించింది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా జిల్లాకు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్)కు చోటు దక్కింది. ఈ కమిటీలో మీనాక్షి నటరాజన్తోపాటు పీసీసీ అధ్యక్షుడు, సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు 22మంది సభ్యులుగా ఉన్నారు. నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతోపాటు మంత్రులను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు.