
బస్తా దిగదు.. బండి కదలదు..
మంచిర్యాలఅగ్రికల్చర్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతుండగా.. మిల్లుల ఎదుట కిలోమీటర్ల మేర లారీలు బారులు తీరుతున్నాయి. బస్తాలను దింపకపోవడంతో ఒక్కో మిల్లు ఎదుట 20 నుంచి 30 లారీలు ఉంటున్నాయి. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, జైపూర్, భీమారం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో 332 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. 138 కేంద్రాల్లో ధాన్యం వస్తోంది. కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లాలోని 11రైస్మిల్లులకు ధాన్యం దించుకునేందుకు ట్యాగింగ్ ఇచ్చారు. జిల్లాలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఎండ వేడిమి..అధిక లోడ్ కారణంగా లారీల టైర్లు పేలిపోవడంతోపాటు లారీ పాడై నష్టపోవాల్సి వస్తోందని డ్రైవర్లు, యజమానులు వాపోతున్నారు. తూకం వేసిన ధాన్యం అన్లోడ్ కోసం లారీలు ఐదారు రోజులపాటు రైస్మిల్లుల వద్ద ఉంటున్నాయి. తాలు, తప్ప, ధాన్యం గింజ విరిగి నూక ఎక్కువగా వస్తున్నాయంటూ ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు తిరకాసు పెడుతున్నారు. సెంటర్ నిర్వాహకులు మిల్లు యజమానులతో బస్తాకు రెండు మూడు కిలోల కోతకు ఒప్పుకుంటే దించుకునేందుకు ఒప్పదం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లారీలు అన్లోడ్ అయి రాకపోవడం, తూకం వేయకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. తరుగు కోసమే తిరకాసు పెడుతున్నారని, ఆలస్యం చేయకుండా ధాన్యం తూకం వేసి దించుకోవాలని కోరుతున్నారు.
కేంద్రాల్లో భారీగా ధాన్యం
జిల్లాలో 3.25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 2,724మంది రైతుల నుంచి 24,603.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 16,466.040 మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించాల్సి ఉండగా, 8,137.120 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం వేసి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 696లారీల్లో ధాన్యం మిల్లులకు తరలించగా.. అన్లోడ్ కోసం 311 లారీలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు వరి కోతలు వేగవంతం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. ధాన్యం ఆరబోసుకునే వీలు లేకుండా నిల్వలు ఉంటున్నాయి. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడంతో కుప్పలు పేరుకుపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15వేల నుంచి 20 వేల బస్తాలతోపాటు ధాన్యం రాశులు కుప్పలుగా కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా కాంటా వేసేందుకు స్థలం లేక నిలిపి వేస్తున్నారు.
రైస్మిల్లర్ల తిరకాసు
మిల్లుల ఎదుట ధాన్యం లారీలు
కిలోమీటర్ల మేర బారులు
అధికలోడు.. ఎండవేడిమితో పేలుతున్న టైర్లు
లారీటైర్ పేలింది..
ఏప్రిల్ 26న దండేపల్లి మండలం వెల్గ నూర్ సెంటర్ నుంచి ధాన్యం లోడుతో మందమర్రి మండలం అందుగులపేట రైస్మిల్లుకు వచ్చిన.. రోజుల తరబడి ధాన్యం బస్తాలోడు, ఎండతో లారీ టైర్ పగిలిపోయింది. ఇప్పటికే రూ.20 వేల వరకు నష్టం. ఇంకో టైర్ కూడా పగిలిపోయేలా ఉంది.
–ఎస్.నర్సయ్య, డ్రైవర్,
గ్రామం: వెల్లనూర్, మం: దండేపల్లి

బస్తా దిగదు.. బండి కదలదు..