
‘భూ భారతి’తో రైతులకు మేలు
మందమర్రిరూరల్: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శంకర్పల్లి జీపీ పరిధిలోని సండ్రోన్పల్లి రైతువేదికలో మంగళవారం తహసీల్దార్ సతీశ్కుమార్శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సారంగపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత, ఎంపీడీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, వ్యవసాయధికారులు బానోత్ప్రసాద్, కిరణ్మయి, తిరుపతి, రైతులు పాల్గొన్నారు.
రైతులకు ప్రయోజనం
కాసిపేట: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన భూ భారతి చట్టం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగహన కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వరకు సమస్యలు పరిష్కరించి మిగతా మండలాల్లోని సమస్యను గుర్తించి ఆగస్టు 15లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ సమావేశమా..
అధికారిక కార్యక్రమమా?
సమావేశంలో అధికారుల తీరుపై బీజేపీ మండలాధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది అధికారిక కార్యక్రమమా లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా ఫ్రోటోకాల్ ఏంటీ.. వేదిక పై కాంగ్రెస్ నాయకులే ఉంటారా.. అని అధికారులతో వాదనకు దిగారు. ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరా అని నిలదీశారు. కలెక్టర్ నచ్చచెప్పి గొడవ సద్దుమణిగించారు.
అర్హులకు రాజీవ్ యువ వికాసం
వర్తింపజేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: రాజీవ్ యువ వికాసం పథకం అర్హులైన లబ్ధిదారులకు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్లోని సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం వై.సురేష్, టీజీబీ ఆర్ఎం మురళీమోహన్రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 30లోగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్