రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Mar 18 2025 12:16 AM | Updated on Mar 18 2025 12:16 AM

● మరొకరికి తీవ్ర గాయాలు ● మృతుల్లో చెన్నూర్‌ మండల వాసి ● హన్మకొండ జిల్లాలో ఘటన ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం

హసన్‌పర్తి: దైవదర్శనానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి హన్మకొండ జిల్లా పరకాల–కిట్స్‌ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్‌ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్‌ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్‌(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్‌(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్‌(18) స్నేహితులు. సుశాంత్‌ పరకాలలోని పాలిటెక్నిక్‌లో థర్డ్‌ ఇయర్‌ చదువుతుండగా, వర్ధన్‌ అదే కళాశాలలో పాలిటెక్నిక్‌ సెకండ్‌ ఇయర్‌ అభ్యసిస్తున్నాడు. విజయ్‌ పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్‌ చదువుతున్నాడు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు.

హాస్టల్‌ నుంచి జాతరకు..

ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్‌, విజయ్‌, సి.వర్ధన్‌ పరకాల నుంచి బైక్‌పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్‌ బైక్‌ నడుపుతుండగా, విజయ్‌, వర్ధన్‌ వెనుక కూర్చున్నారు. వీరితోపాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్‌లపై జారతకు పయనమయ్యారు. సుశాంత్‌ నడుపుతున్న బైక్‌ను ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెనుకాల బైక్‌పై వస్తున్న స్నేహితులు 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే సుశాంత్‌ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్‌ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు సుశాంత్‌ తండ్రి సురేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement