● ఇకపై ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానం
● ఎస్పీ డి.జానకి
మహబూబ్నగర్ క్రైం: పోలీస్శాఖలో పనిచేసే అధికారి నుంచి సిబ్బంది వరకు విధి నిర్వహణతో పాటు కుటుంబానికి తప్పక సమయం ఇవ్వాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా పరేడ్ మైదానంలో శనివారం సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, ట్రాఫిక్ పోలీసులు, మహిళా పోలీసులతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి పరిస్థితుల్లో పోలీసులు ఎలా స్పందించాలి, ఎలా విధులు నిర్వహించాలనే అంశంపై ప్రత్యేక మాక్ డ్రీల్ నిర్వహించారు. అత్యవససర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శనాత్మకంగా చేసి చూపించారు. అనంతరం సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. విధుల కారణంగా ఒత్తిడికి గురవుతారని.. ఈ క్రమంలో ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలన్నారు. కుటుంబ సభ్యులతో సమయం గడపటం ద్వారా మానసిక ప్రశాంతతో పాటు ధృడంగా మారుతారని తెలిపారు. ఆరోగ్యం కోసం నిత్యం యోగా, నడక, ప్రాణయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలన్నారు.
ఇంటి వద్దాకే ఎఫ్ఐఆర్
బాధితులు, ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం ఇకపై పోలీస్స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని ఇంటి వద్ద నుంచి తెలంగాణ పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తోందని ఎస్పీ జానకి ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీలు వంటి ఆస్తి సంబంధిత, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాలు సందర్భాల్లో బాధితులు స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఫోన్ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు చేరుకుని ఫిర్యాదు స్వీకరిస్తారని తెలిపారు. ఫిర్యాదుదారుడు ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో కూడా పోలీసులే బాధితుడి వాగ్మూలం వారి భాషలోనే నమోదు చేసి చదివి వినిపించి వారి సంతకం తీసుకుంటారని తెలిపారు. అక్కడినుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అక్కడే బాధితుడికి ఎఫ్ఐఆర్ అందిస్తారని తెలిపారు. దీనిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


