● పరిహారం చెల్లించాకే ప్రారంభించాలని డిమాండ్
● వెనుదిరిగిన అధికారులు
దామరగిద్ద: పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలంటూ కాన్కుర్తి రైతులు శనివారం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మక్తల్–నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతలలో భాగంగా గ్రామ సమీపంలో రిజర్వాయర్ పనులు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను రైతులు అడ్డుకున్నారు. త్వరలోనే అందరికి పరిహారం అందుతుందని అధికారులు, నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లింపులో జాప్యం చేపడం సరికాదని.. ఆందోళనకు గురవుతున్నారని భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ నారాయణ అన్నారు. అధికారులు రైతులను ఒప్పించేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి 15 రోజుల్లో డబ్బులు చెల్లించి పనులు ప్రారంభిస్తామంటూ అధికారులు వెనుదిరిగారు. పరిహారం చెల్లించాలంటూ రైతుల పక్షాన సర్పంచ్ నారాయణ అక్కడికి వచ్చిన చీఫ్ ఇంజినీర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి, ఎమ్మెల్యే పీఏ మాధవరెడ్డి, స్థానిక నాయకులు ఈదప్ప తదితరులు ఉన్నారు.


