అలంపూర్ రూరల్: మండల పరిధిలోని లింగన్వాయి గ్రామానికి చెందిన కృష్ణకు చెందిన పొగాకు పంట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైనట్లు ఏఓ నాగర్జున్రెడ్డి తెలిపారు. శనివారం ప్రమాదంలో దగ్ధమైన నాలుగు ఎకరాల పొగాకు పంటను పరిశీలించారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం సంభవించిదని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని బాధితుడు అధికారులను కోరారు.
జాతీయ రహదారిపై
లారీ బోల్తా
భూత్పూర్: మున్సిపాలిటీలోని శేరిపల్లి(బి) వద్ద జాతీయ రహదారిపై శనివారం ముందు వెళ్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తా పడింది. టైల్స్ లోడ్తో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఓ మహిళ, పిల్లలతో కలిసి రోడ్డు దాటుతుంగా లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయగా, వెనకాల వస్తున్న కారు సైతం బ్రేక్ వేసింది. దీంతో కారు వెనుకాల వస్తున్న మరో లారీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. శేరిపల్లి(బి) వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల అదుపులో
అనుమానితులు..?
నారాయణపేట రూరల్: ఇటీవల మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం, హత్యా అనుమానాలు గ్రామంలో వినిపిస్తుండడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా అనుమానితులుగా గుర్తించిన నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రూరల్ ఎస్ఐను వివరణ కోరగా విచారణ కొనసాగుతుందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.


