గోపాల్పేట: మానసిక వేదనతో ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గోపాల్పేట మండలం బుద్ధారంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ జగన్మోహన్ వివరాల మేరకు.. బుద్ధారం గ్రామానికి చెందిన ఆవుల రామస్వామి (52) కొంతకాలంగా జిల్లా నీటిపారుదలశాఖలో పనిచేస్తున్నారు. గతంలో గ్రామ వీఆర్ఏగా పనిచేశారు. అయితే తనకు కంటిచూపు సమస్య ఉండటంతో పాటు ఇటీవల తన ఇంటి పక్కనున్న స్థలంపై వివాదం నెలకొనడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.


