మహబూబ్నగర్ క్రైం: మాదకద్రవ్యాలు యువత భవిష్యత్ను అంధకారంలోకి నెట్టే ప్రమాదకర వ్యసనమని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్లో 2వేల మంది విద్యార్థులతో పాటు జేపీఎన్సీఈ ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటూ.. ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ బృందాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవడం.. మంచి స్నేహితులతో కలిసి క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ వ్యసనానికి లోనైతే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం రెండూ దెబ్బతింటాయన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ అలవాటుకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించి బయటపడాలన్నారు. యువత తమ లక్ష్యాలపై దృష్టిపెట్టి మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఈగల్ ఫోర్స్ అదనపు ఎస్పీ పి.కృష్ణమూర్తి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయ విధానాలు, వాటి వెనుక ఉండే నెట్వర్క్పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి.. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఈఎస్ సుధాకర్, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీఎంహెచ్ఓ డా.కృష్ణ, డీఈఓ ప్రవీణ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రత్యేక నంబర్లు ఏర్పాటు..
జిల్లాలో డ్రగ్స్ కట్టడి కోసం పోలీస్ శాఖ ప్రత్యేక నెంబర్లు ఏర్పాటు చేసింది. టోల్ఫ్రీ నంబర్ 1908, వాట్సప్ నంబర్ 8712671111, కంట్రోల్ రూం నంబర్ 8712659360తో పాటు tsnabho-hyd@tspoice.gov.in ఏర్పాటు చేయడం జరిగింది.


