ఎస్సీలకు
స్వయం ఉపాధి రుణాలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా సబ్సిడీపై ఎలక్ట్రికల్ వాహనాలు (బైక్, ఆటో), పాడి పశువులు, సోలార్ యూనిట్ అందించేందుకు ఏప్రిల్ 8 లోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 క్రింద రూ. లక్ష వరకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు (90% సబ్సిడీ)తో, రూ.3లక్షల విలువ గల మూడు చక్రాల ఎలక్ట్రికల్ ఆటో (ప్యాసింజర్/ గూడ్స్) వాహనాలు (70% సబ్సిడీ)తో రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల ( 60% సబ్సిడీ)తో విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ, పశు సంవర్ధక యూనిట్ల కోసం ఆన్లైన్ పోర్టల్ https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9849905996 నంబర్ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
జడ్చర్ల టౌన్: సమస్యల పరిష్కారం కోసం జడ్చర్లలో సోమవారం 44వ నంబర్ జాతీయరహదారిపై ఆశ కార్యకర్తలు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కనీస వేతనం రూ.19 వేలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలనే పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త జాతీయ రహదారుల ధర్నాలో భాగంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఆశా కార్యకర్తలు జడ్చర్ల ఎంబీ మెడికల్ సెంటర్ వద్దకు తరలివచ్చారు. జడ్చర్ల యంబీ మెడికల్ సెంటర్ వద్ద మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఆశ కార్యకర్తలు తరలివచ్చారు. జాతీయ రహదారిపై ధర్నాలకు అనుమతి లేదని, ఒకవేళ రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ గిరిజాబు, సీఐ నాగరాజుగౌడ్ ఆశావర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లానాయక్ జాతీయరహదారిపైకి వెళ్లి.. రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా వందలాది మంది ఆశా కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు తీసి రోడ్డుపైకి వచ్చి.. రాస్తారోకోకు దిగారు. జాతీయరహదారిపై రాస్తారోకో ధర్నాలకు అనుమతి లేదని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేసిన పోలీసులకు వారికి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. దాదాపు గంటసేపు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సీఐటీయూ నాయకులు తెలుగు సత్తయ్య, దీప్లానాయక్లను అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈక్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, ఆశా కార్యకర్తలకు తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వందలాది మంది ఆశాలు వారిని అడ్డుకున్నారు. మహిళా పోలీసులు రాకుండా సీఐటీయూ నాయకులు అడ్డుగా ఉండడంతో పాటు తోపులాటలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ క్రమంలో విజయలక్ష్మి సొమ్మసిల్లిపడిపోయారు. కాసేపటికి తేరుకున్న తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఎట్టకేలకు పోలీసులు ముఖ్యనాయకులను అరెస్టు చేయడంతో.. ఆశా కార్యకర్తలు రాస్తారోకో విరమించారు.
● సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసుకుంటామని విన్నవించినా నిరాకరించటం వల్లే హైవే ఎక్కాలి వచ్చిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధుల సమయంలో నిరంతరంగా సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాధన, సావిత్రి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తే తగిన గుణపాఠం తప్పదన్నారు. రాస్తారోకోలో అమృత, సరోజ, శివలీల, జయలక్ష్మి, పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
44వ నంబర్ జాతీయరహదారిపైఆశా కార్యకర్తల రాస్తారోకో
గంటకు పైగా కొనసాగిన నిరసన
పోలీసులతో తీవ్ర వాగ్వాదం,
పలువురు నాయకుల అరెస్టు
కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు


