జెడ్పీసెంటర్(మహబూబ్ నగర్): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 167 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తుదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను విని సంబంధిత అధికారులతో చర్చించి అర్జీలను పరిశీలించి సమస్యను పరిష్కారం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు.
కలెక్టరేట్లో ప్రత్యేక వైద్య శిబిరం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఒక రోజు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా శిబిరాన్ని ప్రారంభించారు. పిల్లలు, ఎముకల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, ప్రసూతి–గైనకాలజీ, కంటి వైద్యం, మహిళల ఆరోగ్య నిపుణులు కలెక్టరేట్ సిబ్బంది, సాధారణ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్యసేవలు అందించారు. శిబిరంలో భాగంగా కలెక్టరేట్ ఉద్యోగులకు, కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి కార్యక్రమంకు వచ్చిన అర్జీ దారులు, ప్రజలకు రక్తపోటు, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక వైద్య క్యాంపును సద్వినియోగం చేసుకుని ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించుకుని డాక్టర్ల సలహాలు, మందులు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జేఎల్బీ హరిప్రియ, మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్ పాల్గొన్నారు.


