గండేడ్: మండలంలోని ఆశిరెడ్డిపల్లికి చెందిన ఉప్ప రి బాలయ్య మంగళవారం రాత్రి పొలం దగ్గర పడుకున్నాడు. అర్ధరాత్రి ప్రాంతంలో కుక్కలు విపరీతంగా మొరిగాయి. దీంతో ఆయన లేచి టార్చిలైట్ వేసి చూడడంతో కొద్ది దూరంలో చిరుత కూర్చుని కనిపించింది. దీంతో ఆయన గట్టిగా చప్పుడు చేసుకుంటూ భయంతో ఇంటికి వెళ్లిపోయాడు.
కొండాపూర్కు చెందిన గొల్ల మైబయ్య బుధవారం మేకలను మేపుకొని సాయంత్రం ఆరుగంటలకు ఆశిరెడ్డిపల్లి వైపు నుంచి కొండాపూర్కు తిరిగి వస్తుండగా బొందెగట్టు సమీపంలోకి రాగానే రెండు చిరుతలు మేకలపై దాడికి దిగాయి. వెంటనే అప్రమత్తమైన మైబయ్య, ఆయన కుమారుడు మల్లేష్ గట్టిగా ఆరుస్తూ కట్టెలు విసిరారు. దీంతో రెండు మేకలను చిరుతలు వదిలేసి వెళ్లిపోయాయి. అప్పటికే ఒక్క మేక చనిపోగా మరో మేక తీవ్రంగా గాయపడింది. దీంతో వారు భయంతో మిగతా మేకలను తోలుకొని ఇంటికి పరుగులు పెట్టారు.
ఇలా ఒక్కటికాదు రెండుకాదు తరుచుగా ఏడాది నుంచి ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తూ పశువులపై దాడి చేయడంతోపాటు రైతులు, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా బొందెగట్టు ప్రాంతంలో ఒకేసారి మూడు చిరుతలు కంటపడడంతోపాటు మేకల మీద దాడిచేయడంతో ఈప్రాంతం వారు అనుక్షణం భయాందోళన చెందుతున్నారు.
పెరిగిన చిరుతల సంచారం
పొలాలకు వెళ్లాలంటేనే
జంకుతున్న రైతులు
పశువులకు కొరవడిన రక్షణ
బోను ఏర్పాటుపై వీడని సందిగ్ధం
ఆందోళనలో గ్రామీణ ప్రజలు


