జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో లెదర్పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో గురువారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ లెదర్పార్కు కోసం 25ఎకరాల భూమిని కేటాయించారని, అప్పట్లో చర్మ ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఇక్కడి యువతకు శిక్షణ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అంతేగాక మలుపు పథకంలో భాగంగా ఇక్కడ ఓ భవనాన్ని కూడా నిర్మించారని తదుపరి పట్టించుకోక పోవడంతో పథకం లక్ష్యం నీరుగారిపోయిందన్నారు. వృథాగా మారిన ఈ భూమిలో సమీప ఫార్మ పరిశ్రమల చెత్తను డంప్ చేసి కాలుష్యానికి కారణమవుతున్నారని అన్నారు. ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ను సోమశిల మాదిరిగా పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని. ఇక్కడ టూరిజం హోటల్ నిర్మాణంతోపాటు పర్యాటకులకు అందుబాటులో బోట్లను ఏర్పాటు చేయాలన్నారు.
బస్డిపో ఏర్పాటు చేయండి
జడ్చర్లలో ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హైదరాబాద్లో కలిసి విన్నవించారు. కొత్త బస్రూట్లను ఏర్పాటు చేయాలని, బస్టాండ్ను ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరుచాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.


