అచ్చంపేట/ మన్ననూర్: అటవీ సరిహద్దు ప్రాంతా ల్లో నివాసముంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దూరమవుతున్న గిరిజన గ్రామాల కుటుంబాల వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్నట్లు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. బుదవారం హైదరాబాద్లోని సచివాలయం/అసెంబ్లీ హాల్లో అటవీ లోతట్టు కోర్ ఏరియా, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలోని సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాలు, కొల్లంపెంటకు చెందిన 160 కుటుంబాలకుగానూ ఆప్షన్–1లో భాగంగా రూ: 24కోట్లు నగదు రూపంలోని చెక్కులు అందజేశారు. అదేవిధంగా 257 కుటుంబాలకు ఆఫ్షన్–2 వర్తింపజేస్తూ పెద్దకొత్తపల్లి మండలం బాకారం సమీపంలో 5 ఎకరాల సాగుకు అనుకూలమైన భూమి, పక్కా ఇళ్లు, జీపీ భవనం, పాఠశాల, ఆస్పత్రితోపాటు గ్రామంలో అన్నిరకాల వసతుల ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ సంతోష్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, సార్లపల్లి సర్పంచ్ చిర్ర వీరమ్మరాములు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల పునరావాస లబ్ధిదారులు పాల్గొన్నారు.


