జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి వందశాతం మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్లోనే సరఫరా చేయాలని ఆదేశించారు. గతంలో తనిఖీ కమిటీ గుర్తించిన 16 రీచ్లలో రెండు మాత్ర మే ఇసుక బుకింగ్కు కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఇందులో అడ్డాకుల మండలం కన్మనూర్, మూసా పేట మండలం పోల్కంపల్లి రీచ్ల నుంచి మన ఇసుక వాహనం ద్వారా బుకింగ్ సరఫరా చేస్తున్నామన్నారు. తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా స్వాధీనం, ఇసుక డంప్ల వివరాలు, పట్టుబడిన లారీలు, ట్రాక్టర్లు, అక్రమ తవ్వకాలపై విధించిన జరిమానాలపై సమగ్ర సమాచారం ఇసుక వాట్సప్ గ్రూప్లో వివరాలు పోస్ట్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. వచ్చేసారి నిర్వహించే జిల్లాస్థాయి ఇసుక సమీక్ష సమావేశానికి ప్రతి తహసీల్దార్ తమ మండలాల్లో జరిగిన ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ల వివరాలు, అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలు, స్వాధీనం చేసిన వాహనాల వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సిన ఇసుకపై సరైన సమాచారం తీసుకొని.. దానికి అనుగుణంగా అనుమతులు ఇవ్వాలన్నారు. ఇసుక బుకింగ్, సరఫరాపై ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలని, వచ్చే ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఏఎస్పీ రత్నం, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, జిల్లా మైన్స్ శాఖ ఏడీ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సోలార్పై దృష్టిపెట్టాలి
ప్రజలు సోలార్ విద్యుత్పై దృష్టిపెట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని, హరిత ఇంధన వినియోగాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీజీ రెడ్కో మనోహర్రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


