మానవపాడు: అనారోగ్యంతో తండ్రి మరణించినా దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. మానవపాడుకు చెందిన సమీర్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన తండ్రి కరీం(40) అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే సోమవారం ఉదయం ఇంగ్లిష్ పరీక్ష ఉండటంతో బాధలోనూ రాశాడు. మధ్యాహ్నం పరీక్ష ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియలకు హాజరవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
మరో ఘటనలోనూ..
అమరచింత: మండలంలోని నందిమళ్ల ఎక్స్రోడ్కు చెందిన జలేందర్ ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. కాగా ఈయన కుమారుడు సాగర్ పుట్టెడు దుఃఖంలోనూ సోమవారం ఉదయం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష రాశాడు. అనంతరం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
ఉల్పరలో మరొకరు..
వంగూరు: మండలంలోని ఉల్పర జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్ష రాస్తున్న శివకృష్ణ తండ్రి ఆదివారం అనారోగ్యంతో మరణించాడు. అయితే తండ్రికి కర్మకాండ నిర్వహించాల్సిన శివకృష్ణ పరీక్ష రాసేందుకు రాకపోవడంతో ఉపాధ్యాయులు కొండల్రెడ్డి, గణేష్ వెంట తీసుకెళ్లి పరీక్ష రాయించారు. అనంతరం ఇంటికి వచ్చి తండ్రి కర్మకాండ శివకృష్ణ నిర్వహించాడు. ఈ సంఘటన గ్రామస్తులను కలిచివేసింది.


