జడ్చర్ల: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ కళాభవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినా రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి, సంక్షేమం కన్పించడం లేదని విమర్శించారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి భారీ నీటిపారుదల ప్రాజెక్ట్లతో పాటు విద్య, వైద్య, వ్యవసాయ, తదితర రంగాల అభివృద్ధితో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల, తదితర అనేక ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో రూ.3.50 లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి ఏంచేశారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆరు గ్యారంటీ హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు విస్మరించారని పేర్కొన్నారు. యువతకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11 వేల ఉద్యోగాలు ఇచ్చి మోసగించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డి, మహేశ్, సతీష్, నాయకులు రాంమ్మోహన్, నాగిరెడ్డి, ఇమ్ము, తదితరులు పాల్గొన్నారు.


