మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అమృత్–2 పథకం కింద నగరానికి మంజూరైన మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ (ఎంఏయూడీ జేడీ) డి.మమత అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’కు జిల్లా నోడల్ అధికారిణి అయిన ఆమె సోమవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా స్థానిక పద్మావతికాలనీలోని పార్కుకు వెళ్లి వర్మి కంపోస్టు తయారీ విధానంపై ఆరా తీశారు. అనంతరం విఘ్నేశ్వర కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్యం, శివశక్తినగర్లో నిర్మిస్తున్న వరద కాల్వ, శ్రీనివాసకాలనీ సమీపంలోని చెరువు వద్ద ఎస్టీపీ పనులను, కోయిల్కొండ ఎక్స్రోడ్లోని డంపింగ్ యార్డులో డీఆర్సీసీ, వర్మి కంపోస్టు ఎరువుల తయారీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరగా భూసేకరణ ప్రక్రియ చేపట్టి మిగతా రెండు చోట్ల ఎస్టీపీ పనులను ఆరంభించాలన్నారు. శివశక్తి నగర్ వద్ద ఆరంభించిన వరద కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే వర్మి కంపోస్టు ఎరువు తయారీతో పాటు పొడి, తడి చెత్తను వేరే చేసే విధానాన్ని ఇంకా మెరుగుపరచాలన్నారు. ఆయా కార్యక్రమాలలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి, డీఈఈ ప్రవీణ్కుమార్రెడ్డి, ఏఈ వసంత, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్జీ, లక్ష్మయ్య, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్ తదితరులు పాల్గొన్నారు.


