పాలమూరు టు ఏపీ
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కౌన్సిలర్
● క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన అధికార పార్టీ
● కార్పొరేటర్లను రెండు బస్సుల్లో
విజయవాడ, చీరాలకు తరలింపు
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో శిబిర రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నుంచి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన 29 మంది అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్రులను శిబిరాలకు తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రెండు బస్సులతో పాటు కొన్ని కార్లలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేష్, లక్ష్మణ్యాదవ్, ఆనంద్గౌడ్, మల్లు నర్సింహారెడ్డి, కార్పొరేటర్లలో ప్రధానంగా సురేందర్రెడ్డి, సిరాజ్ఖాద్రీ తదితరులు వెళ్లారు. విజయవాడతో పాటు గుంటూరు సమీపంలో ఉన్న చీరాల దగ్గర ప్రత్యేక హోటల్కు రాత్రి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అల్పహారం తర్వాత నూతన కార్పొరేటర్లతో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు భేటీ కానున్నట్లు సమాచారం. గెలుపొందిన తర్వాత మేయర్ పీఠం కోసం అభ్యర్థులు వేరు కుంపటి పెట్టుకోకుండా శిబిర రాజకీయాలకు తెరలేపారు. ఈ బృందం మొత్తం ఈనెల 16న నిర్వహించే మేయర్ ఎన్నిక సందర్భంగా అదే రోజు ఉదయం 11 గంటలకు నేరుగా మహబూబ్నగర్ కార్పొరేషన్ కార్యాలయానికి రానున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం క్యాంప్నకు..
బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 15 మంది కార్పొరేటర్లను శనివారం ఉదయం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఆ తర్వాత వారిని కూడా క్యాంపు శిబిరాలకు తరలించినట్లు సమాచారం. బీజేపీ నుంచి గెలుపొందిన 8 మంది కార్పొరేట్ అభ్యర్థులను పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారందరూ ఇక్కడే నగరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంఐఎం నుంచి గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు సైతం స్థానికంగానే ఉన్నారని సమాచారం.
దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు గడవకముందే కౌన్సిలర్లు పార్టీ కండువాలు మారుస్తున్నారు. దేవరకద్ర 12వ వార్డు నుంచి అధిక మెజార్టీతో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ యుగంధర్రెడ్డి శనివారం హస్తం గూటికి చేరగా.. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 6 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 4, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి అరుణ చంద్రమౌళి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 7కు చేరింది. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ చేరడంతో మెజార్టీ 8కి చేరింది. మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా హస్తం గూటికి చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
పాలమూరు టు ఏపీ


