ఉద్యోగులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం
జెడ్పీసెంటర్(మహబూబ్నర్): ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అరిగోస పెడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికపరమైన సహాయం ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. డీఏలు కూడా ఇవ్వడం లేదని, ఐదు డీఏలు పెండింగ్ ఉన్న రాష్టం తెలంగాణ ఒక్కటే అన్నారు. 317 ప్రభుత్వ ఉత్తర్వులపై సమీక్షించి భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసే విధంగా చేస్తామని మాట తప్పారని ఆరోపించారు. బదిలీల క్యాలెండర్ ఇస్తామని చెప్పారని, జర్నలిస్టు, ఉద్యోగులకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్ కూడా ఇవ్వడం లేదని, దాచుకున్న డబ్బులు రాక గుండెపోటుతో పలువురు మృతి చెందారన్నారు. ఎన్నికలప్పుడు గొప్పగా మాట్లాడిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం లేదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఉద్యోగి చనిపోతే దహన సంస్కారాల ఖర్చులు ఇవ్వలేని దుర్మర్గమైన ప్రభుత్వం అని మండిపడ్డారు.


