తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం
స్టేషన్ మహబూబ్నగర్: తెలుగు జాతి సంస్కృతిలో భాగమైన నాటక రంగాన్ని కాపాడుకుందామని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు సోమవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక కళారంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ 11 ఏళ్ల నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో మన్యంకొండ క్షేత్రంలో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.వివిధ సంస్థలచే శ్రీరామాంజనేయ యుద్ధ సన్నివేశం, భవాని చింతామణి, సుభద్ర అర్జున సీను, కర్ణ రహస్యం సీను, రావణబ్రహ్మ ఏకపాత్రాభినయం నిర్వహించారు. అనంతరం కళాకారులను సన్మానించిన సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు కె.శివప్రసాద్, బంగారు వెంకటయ్య, భాస్కరాచారి, ధర్మన్న, నాగరాజు, వెంకటయ్య, విజయదేవి, శివ పాల్గొన్నారు.
మజ్లిస్కు మద్దతు
ఇవ్వండి: ఓవైసీ
స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతుగా నిలిచి ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్నామని ఒకరు, ఢిల్లీలో అధికారంలో ఉన్నామని మరొకరు, పదేళ్లు పాలించామని ఇంకొకరు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని అడుగుతారని, మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల వల్ల అధికారం ఏర్పడన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేటర్, వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్, మక్తల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల్లో నిలబడిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతుకే డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని అన్నారు. బిహార్లో ఐదుచోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్లు తెలిపారు. మజీస్ పార్టీతో వ్యతిరేకించిన ఒక వ్యక్తి నిలబడితే ఆయనకు డిపాజిట్ కూడా రాలేదన్నారు. మహారాష్ట్రలో 125 మున్సిపల్ కార్పొరేటర్ స్థానాలను మజ్లిస్ పార్టీ గెలిచినట్లు తెలిపారు. ఔరంగాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33 చోట్ల కార్పొరేటర్, ముంబైలో 8 చోట్ల కార్పొరేటర్ స్థానాల్లో గెలవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎంఐఎం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జాబిర్ బిన్ సయీద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ హాదీ, మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, ఎన్నికల ఇన్చార్జిలు జఫర్ఖాన్, అన్వర్సాదత్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు సాదుతుల్లా హుస్సేని, ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం


