అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా ఉచిత బయోమెట్రిక్ అప్డేట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ (డీఎల్ఏఎంసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన విద్యార్థుల ఆధార్ కవరేజీ, మాండేటరీ బయోమెట్రిక్ ఆప్డేట్ (ఎంబీయూ)పై సమీక్షించారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలకు ప్రధానంగా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో నమోదు జరగలేదని గుర్తించారు. ఈ ధ్రువీకరణ పత్రాలు జారీచేసే శాఖలు వేగవంతం చేయడంతో పాటు సర్టిఫికెట్ తీసుకునే సమయంలోనే ఆధార్ నమోదు చేపట్టాలన్నారు. అనాథ, ఇతర ఆశ్రయ గృహాల్లోని ప్రతి పిల్లవాడికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు. 18 ఏళ్లుపై బడిన వారి ఆధార్ ధ్రువీకరణ కేసులను తహసీల్దార్లు రాష్ట్ర ధ్రువీకరణ పోర్టల్లో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సాంఘీక సంక్షేమ, మైనారిటీ శాఖల స్కాలర్షిప్లలో ఆధార్ సమస్యలు, పీవీటీజీ సముదాయాల ఆధార్ నమోదు, ట్రాన్స్జెండర్లకు కొత్తగా నమోదు, జెండర్ అప్డేట్, వందేళ్లు పైబడిన వారి ఆధార్ ధ్రువీకరణ తదితర అంశాలపైనా చర్చించారు. ప్రభుత్వ పథకాలు, పరీక్షలు, ఇతర సేవల సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రతిపౌరుడు తన ఆధార్ నమోదుతో పాటు అప్టేడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే అడ్డాకల్, భూత్పూర్, మూసాపేట, మహబూబ్నగర్ రూరల్, మహమ్మదాబాద్, కౌకుంట్ల మండలాలలో కొత్త శాశ్వత ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనాలు పంపించామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్నాయక్, తెలంగాణ ఆధార్ ప్రాజెక్టు అధికారి నరేష్, డీఈఓ ప్రవీణ్కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి జరీనాబేగం, సీపీఓ రవీందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


