జూరాలకు పెరిగిన వరద
● నెట్టెంపాడుకు కొనసాగుతున్న నీటి పంపింగ్
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 35 వేల క్యూసెక్కులు ఉండగా.. గురువారం రాత్రి 41 వేల క్యూసెక్కులకు చేరినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 45,344 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 47, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 306, సమాంతర కాల్వకు 129, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.173 టీఎంసీలు ఉందన్నారు.
నిర్విరామంగా విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 12 యూనిట్ల నుంచి గురువారం ఉత్పత్తి కొనసాగినట్లు ఏఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు. ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 485.009 మి.యూ., దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 474.900 మి.యూ. ఉత్పత్తి చేపట్టామన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 959.909 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని.. ఇందుకుగాను 46 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించామని తెలిపారు.
శ్రీశైలంలో 884.0 అడుగులు..
శ్రీశైలం జలాశయంలో గురువారం 884.0 అడుగుల నీటిమట్టం, 210.0320 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 45,527 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,958 క్యూసెక్కుల నీటి ప్రవాహం జలాశయానికి చేరిందన్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్కు వదిలినట్లు చెప్పారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు రెండు వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతలకు 2,832, ఎంజీకేఎల్ఐకు 267 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 15.722 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 1.617 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు.


