‘ఉపాధి’ పనుల గుర్తింపు షురూ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పనుల గుర్తింపు షురూ

Nov 4 2025 8:23 AM | Updated on Nov 4 2025 8:23 AM

‘ఉపాధి’ పనుల గుర్తింపు షురూ

‘ఉపాధి’ పనుల గుర్తింపు షురూ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వందరోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన పనులు గుర్తించేందుకు గ్రామసభల నిర్వహణ ప్రారంభమైంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ మేరకు గ్రామసభల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.

ప్రజాభీష్టం మేరకే..

ఉపాధి పనుల్లో ప్రజలు, రైతులను భాగస్వాములను చేయనున్నారు. వారు కోరిన పనులు కల్పించేలా ప్రభుత్వం ఏటా గ్రామసభలు నిర్వహిస్తోంది. గతనెల నిర్వహించాల్సి ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కారణంగా చేపట్టలేదు. తాజాగా కోడ్‌ ఎత్తి వేయడంతో జిల్లాలో గ్రామసభలు మొదలుపెట్టారు. ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు హాజరై రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై గ్రామస్తులతో చర్చిస్తారు. గుర్తించిన పనులను కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు చదివి వినిపిస్తారు. తర్వాత ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు వాటికి సంబంధించిన అంచనాలు రూపొందిస్తారు. చివరికి జాబ్‌ కార్డ్లు ఆధారంగా పనులను నిర్ణయిస్తారు. పంచాయతీల వారీగా నివేదికలను మండల, జిల్లా పరిషత్‌కు పంపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వాటికి పాలకవర్గాలు లేనందున కలెక్టర్‌ నివేదిస్తారు. కలెక్టర్‌ వాటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదిస్తారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక జిల్లాలో ఆయా పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తారు.

భూగర్భజలాలు, పండ్ల తోటలు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో ప్రధానంగా భూగర్భ జలాలు పెంపొందించడంతోపాటు వ్యవసాయ పరంగా రైతాంగానికి మేలు చేకూర్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నీటి సంరక్షణకు సంబంధించి కుంటలు, చిన్నపాటి చెరువులు, స్టోన్‌ బండింగ్‌, గులకరాళ్ల ఏరివేత, పశువులు, మేకలు, గొర్రెల కొట్టాల నిర్మాణం, పండ్ల తోటలు, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటు రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా మట్టి రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేలా పండ్ల తోటలు, ఈతవనాలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. మార్కెట్లో డిమాండ్‌ కలిగిన మామిడి, కొబ్బరి, సీతాఫల్‌, జామ వంటి పండ్ల తోటల పెంపకంతోపాటు నీలగిరి చెట్ల పెంపకానికి సంబంధించి అంచనాలు రూపొందించనున్నారు. అలాగే గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా వెదురు మొక్కల పెంపకం, పాడి ఉత్పత్తి పెంచేలా పశువుల పాకల నిర్మాణాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

2026– 27 ఆర్థిక సంవత్సరానికి

గాను ప్రణాళికలు

ఇప్పటికే ప్రారంభమైన

గ్రామసభల నిర్వహణ

భూగర్భజలాల పెంపు, పండ్లతోటలపెంపకానికి ప్రాధాన్యం

ప్రజలు, రైతులు, గిరిజనులతోఅభిప్రాయ సేకరణ

వందరోజులు పని కల్పిస్తాం..

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026– 27) గాను ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే గ్రామసభలు నిర్వహణ ప్రారంభమైంది. ప్రజలకు అవగాహన కల్పించి ఎలాటి పనులు చేపట్టాలనే దానిపై వారి అభిప్రాయాలు తీసుకుంటాం. వాటి ఆధారంగా ప్రతి కూలికి వంద రోజులపాటు పని కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తాం. – నర్సింహులు, డీఆర్‌డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement