
హత్య చేసి..
ప్రియుడితో భర్తను చంపించిన భార్య
రోడ్డు ప్రమాదంగా
చిత్రీకరించే యత్నం
నాగర్కర్నూల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని కట్టుకున్న భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న నాగర్కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నాగర్కర్నూల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములు (37) గుడిపల్లి శివారులో ఈ నెల 12న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతుడు మైనగాని రాములు ఇంట్లో 6 నెలల క్రితం బంగారం చోరీకి గురికాగా.. పెద్దముద్దునూరుకు చెందిన సురేశ్గౌడ్ తన మంత్ర శక్తితో కనిపెడతారని కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మృతుడి భార్య మానసకు సరేశ్గౌడ్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. మానస, సురేశ్గౌడ్ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మానస తన భర్తను ఎలాగైనా హత్య చేయించాలని పథకం రచించింది. ఈ నెల 8న తన కుటుంబ సభ్యులతో కలిసి గుడిపల్లికి వెళ్తున్నామని.. నాలుగు రోజులు అక్కడే ఉంటామని సురేశ్గౌడ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అక్కడే తన భర్తను హతమార్చాలని చెప్పింది. ఈ మేరకు రాములును హత్య చేసేందుకు సురేశ్గౌడ్ తన వద్ద పనిచేస్తున్న వెన్నచర్ల గ్రామవాసి బాలపీరు, లక్ష్మీతండాకు చెందిన హన్మంతుతో రూ. 2.80 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత మానసకు ఫోన్చేసి రాములును హతమార్చేందుకు ఓ పార్టీ ఉందని.. అతడితో కలిసి పెద్దముద్దునూరుకు రావాలని చెప్పాడు. ఇవేవీ తెలియని రాములు తన భార్యతో కలిసి పెద్దముద్దునూరుకు వెళ్లగా.. అక్కడ మద్యం తాగించారు. అనంతరం నిందితుడు సురేశ్గౌడ్ తన కారులో గుడిపల్లి శివారులోని కేఎల్ఐ కాల్వ వద్దకు తీసుకొచ్చి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అనంతరం రాములు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మిచేందుకు మృతదేహంతో పాటు మోటారు సైకిల్ను రోడ్డుపై వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. హత్యకు పాల్పడిన సురేశ్గౌడ్, మానసతో పాటు బాలపీరు, హన్మంతును అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం
మృతుడి తండ్రి ఫిర్యాదుతో
అనుమానాస్పద కేసు నమోదు
భార్య, ఆమె ప్రియుడితో పాటు
మరో ఇద్దరి రిమాండ్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్