
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
● 1,10,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో..
● 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టుకు 76,800 క్యూసెక్కుల వరద రాగా.. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1,10,500 క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్ట్ 8 క్రస్ట్గేట్లు ఎత్తి 56,648 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని.. విద్యుదుద్పత్తి నిమిత్తం 40,978 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 700, భీమా లిఫ్ట్కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.969 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
606 మి.యూ. విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోంది. శనివారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 289.616 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 316.385 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు రెండు కేంద్రాల్లో 606.001 మి.యూ. విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
శ్రీశైలం జలాశయం ఒక గేటు ఎత్తి..
శ్రీశైలం ఆనకట్ట వద్ద శనివారం ఒక గేటు పైకెత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల స్పిల్వే ద్వారా 56,648 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 40,978 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 35,832 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. ఆనకట్ట ఒక గేట్ పది అడుగుల మేర పైకెత్తి 27,662 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,665 క్యూసెక్కులు అదనంగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 884.1 అడుగుల నీటిమట్టం.. 210.5133 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో 16.973 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 15.265 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు.