
జూరాలకు పెరిగిన వరద
ధరూరు/ రాజోళి/ దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద స్వల్పంగా పెరిగింది. గురువారం ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు 80 వేల క్యూసెక్కులకు పెరిగిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 48,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 34,227 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, నెట్టెంపాడుకు 750, ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 530, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాల్వకు 200, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 45 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
● ఇదిలా ఉండగా.. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో తగ్గింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 32,932 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువకు 42,500 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువకు 43,488 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సుంకేసులకు ఇన్ఫ్లో..
సుంకేసుల డ్యాంకు శుక్రవారం ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 7 గేట్లను తెరిచి 34,488 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్ 1,847 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
వేగవంతంగా విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 345.156 మిలియన్ యూనిట్లు సాధించారు.
ఎగువ నుంచి 80 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాక
12 క్రస్టు గేట్ల ఎత్తి.. దిగువకు 85,391 క్యూసెక్కుల విడుదల