
జడ్చర్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో.. ఏసీబీ విస్తృత త
జడ్చర్ల: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. స్థానిక మార్కెట్యార్డు గంజ్ ప్రాంతంలో గల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేరుకున్న ఏసీబీ అధికారుల బృందం మొదటగా గ్రౌండ్ ఫ్లోర్లో గల డాక్యుమెంట్ రైటర్ కార్యాలయాల్లోకి వెళ్లి షట్టర్లు వేసి తాళాలు స్వాధీనపర్చుకున్నారు. వారి వద్ద ఉన్న పలు రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను తీసుకున్నారు. కార్యాలయం వద్ద ఇరువురు డాకుమెంట్ రైటర్ల వద్ద గల కొంత నగదు స్వాధీనపర్చుకున్నట్లు సమాచారం. తర్వాత మొదటి అంతస్థులో గల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోకి నేరుగా వెళ్లిన అధికారుల బృందం ప్రధాన ద్వారాన్ని మూసి వేసి కార్యాలయాన్ని అదుపులోకి తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ సమ్మయ్య చాంబర్లోకి వెళ్లి అక్కడ తనిఖీలు చేపట్టారు. టేబుళ్లు, ఇతర డెస్క్లను ఓపెన్ చూసి పరిశీలించారు. అలాగే కార్యాలయంలో ఉన్న పలువురు డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనపర్చుకున్నారు. సిబ్బందిని సైతం వ్యక్తిగతంగా ఓ చాంబర్లోకి పిలిచి తనిఖీలు చేశారు. నిబంధనల మేరకు కార్యాలయంలోని విధులకు హాజరైన సందర్భంలో సంబంధిత అధికారి, ఇతర ఉద్యోగుల వద్ద ఉన్న నగదును ఓ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారంగానే వారి వద్ద ఉన్న నగదును విచారించి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉండడంతో ఆయా రిజిస్టర్ను సైతం తీసుకున్నారు. ఇక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి కీలకంగా ఉండి డాక్యుమెంట్ రైటర్లకు, పైరవీకారులకు, అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తారని అతని ద్వారానే పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతాయని అతను తనిఖీల సమయంలో కార్యాలయానికి రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఏసీబీ తనిఖీల విషయం ముందుగానే లీక్ కావడంతోనే అతను ఇంట్లోనే ఉన్నా కార్యాలయానికి హాజరు కాలేదన్నారు.
రాత్రి 8.30 వరకు
సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏసీబీ అధికారులు చేపట్టిన తనిఖీలు రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్స్కు సంబంధించిన కొందరి మొబైల్ ఫోన్లను స్వాధీనపర్చుకున్న అధికారులు వారి ఫోన్ పే, గూగుల్ పే, తదితర ఆన్లైన్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారించిన తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీలు అర్ధరాత్రి దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
షట్టర్లకు తాళాలు వేసి.. రాత్రి 8.30 గంటల దాక పరిశీలన
పలు రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం?
మూతబడిన డాక్యుమెంట్ రైటర్స్
కేంద్రాలు
ఇదే మొదటిసారి..
జడ్చర్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయ చరిత్రలో ఏసీబీ దాడుల జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నోసార్లు అవినీతి, ఆరోపణలు వచ్చినా ఎప్పుడూ తనిఖీలు చోటు చేసుకోలేదు. అయితే డిజిటల్ లావాదేవీలు లేని సమయంలో సైతం భారీగా నగదును దర్జాగా తీసుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఏసీబీ దాడులు చేయ డం ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది.