
ఫేషియల్ రికగ్నిషన్తో హాజరు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరును ఇకపై ప్రతిరోజు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ హాల్లో అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అటెండెన్స్ ద్వారా విద్యార్థుల హాజరు విధిగా నమోదు చేయాలన్నారు. ఇందులో మొబైల్ నెట్వర్క్ రాకున్నా విద్యార్థుల హాజరును నమోదు చేయవచ్చని, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డేటా అప్లోడ్ అవుతుందని చెప్పారు. స్కూల్లో అటెండెన్స్ నమోదు చేయడం హెచ్ఎం బాధ్యత అని, ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత విద్యా శాఖాధికారి అధికారారులను సంప్రదించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాంలు వచ్చాయా అని హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కంప్యూటర్లు పనిచేసేలా చూడాలని, విద్యుత్ సరఫరా లేనిచోట పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు అక్షరమాల, గుణింతాలు, వర్ణమాల నేర్పించాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు సరిపడా పుస్తకాలు వచ్చాయా అని ఆరాతీశారు. కళాశాలల్లో మరమ్మతు కోసం డబ్బులు మంజూరయ్యాయని, అవసరమైన చోట వెంటనే చేపట్టాలని సూచించారు. కేజీబీవీలు, రెసిడెన్సియల్ పాఠశాలలు, కాలేజీలకు హెల్త్ చెకప్ ఆర్బీఎస్కే ద్వారా ఎన్ని చోట్ల చేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి టీచర్లు నేర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్కుమార్, ఆయా శాఖల సంక్షేమాధికారులు శంకరాచారి, ఇందిర, సునీత, సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైనవైద్యసేవలు అందించాలి
దేవరకద్ర: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం ఆమె స్థానిక పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని ఆరా తీశారు. గర్భిణులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మీనుగోనిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకున్న విజయమ్మ ఇంటికి కలెక్టర్ వెళ్లారు. ఇల్లు అందంగా నిర్మించుకున్నావని విజయమ్మను అభినందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల, డోకూరు సమీపంలోని కేజీబీవీని తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మీనుగోనిపల్లి శివారులో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి.. సర్వే నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులున్నారు.