కొత్తకోట: అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. వనపర్తి నుంచి కొత్తకోట వైపుగా వస్తున్న కారు కొత్తకోటలోని బీపీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న బాలరాజు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఎస్ఐ ఆనంద్, మృతుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోట మండలంలోని రాఘవేంద్ర కాలనీలో నివసిస్తున్న దాసరి సుక్కమ్మ, శివన్నకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో ఇంట్లో ఉంటుండడంతో కొడుకు బాలరాజు చేపలు అమ్మి జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో మండలంలోని కానాయపల్లి చెరువులో చేపలు పట్టేందుకు బాలరాజు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడని తల్లి తెలిపారు. ఈ క్రమంలో స్థానిక బీపీఆర్ ఫంక్షన్హాల్ వద్దకు రాగానే కారు డ్రైవర్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో బాలరాజు తలకు రక్తపు గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని తల్లి సుక్కమ్మ తెలిపారని ఎస్ఐ వివరించారు. ఘటన మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆనంద్ తెలిపారు.