చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Jun 1 2025 12:44 AM | Updated on Jun 1 2025 12:44 AM

చేపల

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

పెద్దకొత్తపల్లి: కేఎల్‌ఐ కాల్వలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నలబొగుడ గ్రామానికి చెందిన పుట్టపాగ శివకుమార్‌(35) భార్య, కుమారుడితో కలిసి కూలి పనులు చేస్తూ జీవించేవారు. శుక్రవారం సాయంత్రం కేఎల్‌ఐ కాల్వలోకి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. శనివారం పెద్దకొత్తపల్లి పోలీసులు జాలర్లను పిలిపించి కేఎల్‌ఐ కాల్వలో గాలింపు చేపట్టగా శివకుమార్‌ మృతదేహం లబించింది. అతని తల్లి బురానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భూ తగాదాలో భార్యాభర్తలపై దాడి

తాడూర్‌: భూ తగాదాలో భార్యాభర్తలపై దాడికి పాల్పడిన సంఘటన తాడూరు మండలంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుస్వామి కథనం మేరకు.. మండలంలోని ఐతోలు గ్రామానికి చెందిన దాయదులు గోపాల్‌రెడ్డి, క్రిష్టారెడ్డి మధ్య ఎన్నో ఏళ్లుగా భూ సంబంధ తగాదాలున్నాయి. ప్రతి ఏటా పొలాలు దున్నే సమయంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం గోపాల్‌రెడ్డి, తిరుపతమ్మ దంపతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే గ్రామానికి చెందిన దాయాది క్రిష్ణారెడ్డి పొలం వద్ద గోపాల్‌రెడ్డి, తిరుపతమ్మలపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. గోపాల్‌రెడ్డి కూతురు అనూష ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

చికిత్స పొందుతూవ్యక్తి మృతి

మరికల్‌: కారు ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత నెల 15న మరికల్‌లోని పెట్రోల్‌ బంకు సమీపంలో ఓ కారు రెండు బైక్‌లను ఢీకొట్టింది. ప్రమాదంలో మరికల్‌కు చెందిన రంగలి శ్రీకాంత్‌ (22) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చిన్న చింతకుంట మండలం ఉంద్యాలకు చెందిన శివారెడ్డిని (42) హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఇతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

హన్వాడ: అతివేగంతో వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించిన ఘటన శనివారం సాయంత్రం ఇబ్రహీంబాద్‌ శివారులోని ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంబాద్‌ గ్రామానికి చెందిన మునిమోక్షం వెంకట్‌రెడ్డి సొంత పనుల నిమిత్తం బైక్‌పై హన్వాడకు బయలుదేరాడు. ఈ క్రమంలో వెనకాల నుంచి వస్తున్న కారు, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట్‌రెడ్డికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. కారు నడిపన వ్యక్తి కోస్గికి చెందిన బలిజ రవిగా గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంకట్‌రెడ్డి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేని ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

వేడినీళ్లు పడి బాలుడికి గాయాలు..

చికిత్స పొందుతూ మృతి

నవాబుపేట: స్నానం కోసం వేడి చేసిన నీరు ఒంటిపై పడి తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్‌ సోదరుడి కుమారుడు చిన్ను (10 నెలలు) గత నెల 15న ఇంట్లో స్నానానికి పెట్టిన వేడి నీటి బకెట్‌ను పైన వేసుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స కోసం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. దీంతో ఈ ఘటనపై బాలుడి పెదనాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి 
1
1/3

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి 
2
2/3

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి 
3
3/3

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement