
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రాజాపూర్(బాలానగర్): బాలానగర్ మండలంలోని తిర్మలగిరి గ్రామానికి చెందిన రాంచంద్రయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఆదివారం అతని మృతిపై అనుమానం ఉన్నట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిర్మలగిరి గ్రామానికి చెందిన రాంచంద్రయ్య(57) శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న చోటే మృతి చెందాడు. భర్త మృతిపై అనుమానం ఉండటంతో పోలీసులకు భార్య పోలే మైసమ్మ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అడ్డాకుల: మూసాపేట మండలం మహ్మదుస్సేన్పల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. గ్రామానికి చెందిన కంతి కాశన్న (55) కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు. అయితే కొన్నాళ్ల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున కుమారుడు మహేష్ తండ్రి కోసం వెతకగా బాత్రూంలో ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వివాహిత మృతి
ఎర్రవల్లి: చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన అశ్వ శంకరమ్మ (45)ను భర్త అశ్వ విశ్వనాథం (రెండో భార్య) పుట్టింటికి పంపకపోవడంతో భర్తతో గొడవపడి మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గత నెల 30న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్లులో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు అశ్వ చంద్రయ్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పెద్దదిన్నె గ్రామంలో వృద్ధుడు..
ఇటిక్యాల: మండలంలోని పెద్దదిన్నె గ్రామానికి చెందిన గొల్ల నారాయణ (71) చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. నారాయణ పదేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 24న తన కల్లం దొడ్డిలోని గుడిసెలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు గొల్ల బాలకృష్ణ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి
దుర్మరణం
నాగర్కర్నూల్ క్రైం: ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మంతటి చౌరస్తా సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంతటి గ్రామానికి చెందిన కుర్వ కతాల్ (45) మంతటి చౌరస్తా వద్ద చికెన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై గోవర్దన్ తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
కల్వకుర్తి రూరల్: మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి ప్రకాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ప్రకాష్ ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఎటు తేలక పోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.