
నేడు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఎన్నికలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సీనియర్ సిటిజన్స్ ఫోరం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం పది గంటలకు స్థానిక మెట్టుగడ్డలోని బీఈడీ కళాశాల ఆవరణలో ఉన్న సర్వశిక్షా అభియాన్ ఆర్వీఎం హాల్ నిర్వహించే ఓటింగ్లో అర్హులైన 163 మంది సభ్యులు పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం ఒక ప్రకటనలో కోరారు. కాగా, ఈ ఫోరం 2015 జూన్లో 15 మంది సభ్యులతో ప్రారంభం కాగా ప్రస్తుతం 407 మంది ఉన్నారు. 2018 ఆగస్టు 5న ఎన్నికై న కార్యవర్గమే ఇప్పటివరకు కొనసాగుతోంది. తిరిగి ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరగనుండటం గమనార్హం.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్వయం ఉపాధి కోర్సులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారికి ఇక్కడ మూడు నెలల పాటు ఉచితంగా కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్), ఫ్యాషన్ డిజైనింగ్ – గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, మగ్గం వర్క్పై శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు ఫోన్ నం.94404 10459, 94415 65895లలో సంప్రదించాలని సూచించారు.
కాంగ్రెస్ నాయకులకు షోకాజ్ నోటీసులు
గద్వాల: నడిగడ్డలో అధికార పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది. ఇది వరకే గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, సరిత వర్గాల మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని తీసుకొని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి సరిత ఇంటికి వెళ్లడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ మల్లు రవి మధ్య ఉన్న వైషమ్యాలు వీధికెక్కాయి. మల్లురవి ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పందించగా..సర్దుమణిగినట్లయింది. ఈ నేపథ్యంలో తాజాగా సంపత్ వర్గీయులైన యువజన కాంగ్రెస్ నాయకులకు బుధవారం రాత్రి అనూహ్యంగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గద్వాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల నర్సింహ, అలంపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వరకుంట్ల గణేష్, గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేఎంఆర్ యేసు, మానవపాడు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాశపోగు శేఖర్కు నోటీసులు జారీ చేశారు. తన వర్గీయులకు నోటీసులు ఇవ్వడంపై సంపత్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.