
పాలమూరుపై కక్షగట్టిన పాలకులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సాగునీటిని ఇతర జిల్లాలకు తరలించడం, ఇథనాల్ కంపెనీలను పెట్టించి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న తీరును చూస్తుంటే.. పాలకులు కక్ష గట్టినట్టుగా ఉందని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి విమర్శించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు నీరు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాకు దక్కాల్సిన నీటిని డిండికి తరలించుకుపోతుంటే ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్టనట్టుగా ఉండటం దారుణమన్నారు. ఈ పరిణామాలు జిల్లా ప్రజలు బతుకనిచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి తరలింపు చర్యలను ఆపకపోతే మరో పోరాటం చేస్తామన్నారు. అదే విధగా వ్యవసాయ భూములు, ప్రజల జీవనాన్ని నాశనం చేసే ఇథనాల్ కంపెనీలను పెట్టనిచ్చేది లేదని జిల్లా ప్రజలు, రైతులు పోరాటం చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం బలవంతంగా ఫ్యాక్టరీలు పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీ పాలసీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర నది ఒడ్డున టీజీ వెంకటేశ్ విషపూరితమైన కంపెనీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కంపెనీ ఏర్పాటుతో అలంపూర్ ప్రాంతంతో పాటు కృష్ణానది విషపూరితం అవుతుందన్నారు. బనకచర్ల నుంచి ఆంధ్రాకు గోదావరి నీరు తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రశ్నించకపోవడం దుర్మార్గమన్నారు. చంద్రసాగర్ లిఫ్ట్ ద్వారా అమ్రాబాద్ ప్రాంత రైతులకు సాగునీటిని అందించాలని కోరారు. సమావేశంలో టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి, విజయ్కుమార్, తిమ్మప్ప, బాలకృష్ణ, జలీల్ పాషా తదితరులు ఉన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటు,సాగునీటి తరలింపుతో అన్యాయం
ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలి
పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి