
లక్ష్యం.. రూ.10,772.71 కోట్లు
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో 2025– 26 సంవత్సరం రుణాలను అందించేందుకు క్రెడిట్ ప్లాన్ను బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఈ ప్లాన్కు అనుగుణంగానే జిల్లాలో రుణాలను అందించనున్నారు. రైతులకు ఇచ్చే పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలను ఖరారు చేశారు. వీటితోపాటు వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో యాంత్రీకరణలో భాగంగా పరికరాలను ఇచ్చేందుకు లక్ష్యాలను నిర్ణయించారు. వీటితోపాటు చిన్న పరిశ్రమలు, మహిళా సంఘాలకు అందించే రుణ ప్రణాళికను సైతం ఖరారు చేశారు. జిల్లాలో నిర్వహించే బ్యాంకర్ల కమిటీ ద్వారా విధివిధానాలు ప్రకటించి పూర్తిస్థాయిలో రుణాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించేందుకు జూన్ ఆరంభం నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులతోపాటు చిన్న పరిశ్రమల వారికి కూడా ఈ రుణాలను అందించనున్నారు.
పంటలతోపాటు పరిశ్రమలు..
జిల్లాలో ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగిలో అందించే రుణ ప్రణాళికలను రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ ఖరారు చేసింది. జిల్లాల లక్ష్యాలను కూడా నిర్ణయించింది. ఆ వివరాలను జిల్లాలకు పంపించింది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10,772.71 కోట్ల రుణాలను అందించేందుకు నిర్ణయించి.. బ్యాంకర్ల కమిటీలో ఖరారు చేశారు. పంట రుణాలతోపాటు పరిశ్రమలు, ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, సోలార్ ఎనర్జీ, ఇతర రంగాలకు ఇచ్చే రుణాలను ఖరారు చేశారు.
వ్యవసాయ రంగానికి రూ.5,906.93 కోట్లు
జిల్లా రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎప్పటి మాదిరిగానే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పంట రుణాలకు, వ్యవసాయ రంగంలో ఇతర అవసరాలకు రూ.5,906.93 కోట్లు రైతులకు రుణంగా ఇవ్వాలని నిర్ణయించారు. వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లా పంట రుణాల వార్షిక ప్రణాళికను అధికారులు రూ.5,906.93 కోట్లతో సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.977.52 కోట్లు అధికంగా కేటాయించారు. అయితే గతేడాది రుణ ప్రణాళికను రూ.4,929.41 కోట్లు కేటాయించగా.. అందులో కేవలం రూ.2,002.55 కోట్లు (59.81 శాతం) రుణాలను మాత్రమే రైతులకు అందజేశారు. ఫలితంగా రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఈసారైనా నిర్ణయించిన పంట రుణాలను సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు.
3.46 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో 3,46,830 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వాటికనుగుణంగా రూ.2,608.1 కోట్ల పంట రుణాలు రైతులకు ఇచ్చేందుకు నిర్ధారించారు. ఇవి కాకుండా అనుబంధంగా ఉన్న సూక్ష్మ, చిన్న తరహా రంగాలతోపాటు లాంగ్టర్మ్ (ఎల్టీ) రుణాల కోసం మరో రూ.2,269.95 కోట్లను రుణ లక్ష్యంగా నిర్దేశించారు.
జిల్లా 2025– 26 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం
జూన్ ఆరంభం నుంచే పంట రుణాలు ఇచ్చేందుకు కసరత్తు

లక్ష్యం.. రూ.10,772.71 కోట్లు