
డివిజన్ల విభజన ముసాయిదా సిద్ధం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియకు సంబంధించిన ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. ఈ మేరకు గత జనవరి 4న రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. అదే నెల 27 నుంచి పూర్తిస్థాయిలో కార్పొరేషన్గా మారింది. అప్పటి వరకు ఉన్న 49 వార్డులను కాస్త తాజాగా 60 డివిజన్లకు పెంచుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2012, 2025లో విలీనమైన గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, వార్డుల స్థానంలో డివిజన్ల పేరిట బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద కార్పొరేషన్గా పేరు మార్చారు. అనంతరం డివిజన్ల విభజనలో భాగంగా హద్దులను నిర్ణయిస్తూ నక్షలను టౌన్ ప్లానింగ్ అధికారులు రూపొందించారు.
త్వరలోనే నోటిఫికేషన్
ఏయే వీధులు ఏ డివిజన్ పరిధిలో ఉంటాయో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సుమారు 15 రోజుల వ్యవధిలోనే నగర ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాతే డివిజన్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. కాగా.. ప్రస్తుతం నగరంలో జనాభా 3,36,647 మంది ఉండగా.. మొత్తం ఓటర్లు 1,90,774 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఏ డివిజన్ పరిధిలో ఏయే వీధులు ఉంటాయి..? ఏది ఎక్కడికి మారుతుందోనని ప్రజలతోపాటు స్థానిక నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు
ఇప్పటికే నక్ష, హద్దులు నిర్ణయించిన టౌన్ ప్లానింగ్ అధికారులు
త్వరలోనే నగర ప్రజలు, ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ