విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి

May 31 2025 12:20 AM | Updated on May 31 2025 3:28 PM

మాగనూర్‌: మండలంలోని మందిపల్లిలో విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మందిపల్లి గ్రామానికి చెందిన బలరాం కుమారుడు భాను ప్రకాష్‌ (14) తన బాబాయి కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో భాను ప్రకాష్‌ ఇంటికి క్యూరింగ్‌ చేసి మోటార్‌ ఆఫ్‌ చేసే క్రమంలో కరెంట్‌ షాక్‌కు గురై మరణించాడు. అయితే ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మాగనూర్‌ ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.

అనుమానంతో భర్త అమానుషం

భార్య మృత్యువాత

పోలీసుస్టేషన్‌లో లొంగుబాటు

పెద్దకొత్తపల్లి: అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడై భార్యపై దాడి చేసి చంపిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్‌పల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి గంట్రావ్‌పల్లికి చెందిన గొల్ల ఎలుక నాగశేషు తన భార్య ఎల్లమ్మ (40) తలపై కర్రతో బలంగా కొట్టడంతో ఆమె సృహ తప్పి పడిపోయింది. బాధితురాలిని బంధువులు చికిత్స కోసం వనపర్తికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మృతిచెందింది. దీంతో నాగశేషు పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతురాలి అన్న శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్‌, ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. ఘటనపై వారు గ్రామంలో విచారణ చేపట్టారు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎల్లమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

కరెంట్‌ షాక్‌తో యువకుడి మృతి

మానవపాడు: మండలానికి చెందిన యశ్వంత్‌ కుమార్‌ (21) కరెంట్‌ షాక్‌కు గురై మరణించాడు. యశ్వంత్‌ కుమార్‌ ఇటీవల ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూర్‌ మండలంలో సర్వే పనులకు వెళ్లాడు. అక్కడ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. యువకుడు మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చోరీ కేసులో మూడేళ్ల జైలుశిక్ష

ఆత్మకూర్‌: ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడికి ఆత్మకూరు కోర్టు జడ్జి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించారని డీఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు. శుక్రవారం ఆత్మకూర్‌లో సీఐ శివకుమార్‌, ఎస్సై నరేందర్‌తో కలసి డీఎస్పీ వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 23న ఆత్మకూర్‌లోని భార్గవినగర్‌లో నివాసముంటున్న మణివర్ధన్‌రెడ్డి నివాసంలోకి కురుమూర్తి అనే అతను చొరబడి రూ.1500 నగదు, పూజ సామగ్రిని ఎత్తుకెళ్లాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని శుక్రవారం ఆత్మకూర్‌ కోర్టులో హాజరుపర్చగా వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి శ్రీలత దోషికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

విద్యుత్‌ తీగలు తెగి పడి గేదెల మృతి

మరికల్‌: ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగి పడి మూడు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మరికల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మంతన్‌గోడు భాస్కర్‌రెడ్డికి చెందిన గేదెలు గ్రామ శివారులోని ఇబ్రహీంపట్నం రహదారి పక్కన మేత మేస్తుండగా ఆకస్మాతుగా విద్యుత్‌ తీగలు తెగి వాటిపై పడడంతో గేదెలు మరణించాయి. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని తెగిపడిన తీగలను తొలగించారు. పశు వైద్యాధికారి మహాదేవ్‌ మృతి చెందిన గేదెలకు పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేశారు. మరణించిన గేదెల విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని, విద్యుత్‌ శాఖ తరపున బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

విద్యుదాఘాతంతో గేదె మృతి

చారకొండ: మండలంలోని శేరి అప్పారెడ్డిపల్లిలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన గోలి జోగి రెడ్డి గేదెను మేత కోసం పొలంలో వదిలాడు. గేదె మేత మేసే క్రమంలో పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఎర్తు వైరుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన గేదె విలువ రూ.30 వేలు ఉంటుందని రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. విషయం తెలుసుకున్న పశు వైద్యాధికారి షేక్‌ మదార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు.

విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి 1
1/1

విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement