
మహిళపై దాడి: కేసు నమోదు
గద్వాల క్రైం: గేదెలు మేపడానికి తీసుకెళ్లిన ఓ మహిళను అకారణంగా దూషించి, విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో బాధ్యుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన దళిత మహిళ లక్ష్మి మంగళవారం ఉదయం గేదెలు మేపేందుకు శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి.. సాయంత్రం ఇంటికి వస్తుండగా విష్ణువర్ధన్రెడ్డి వ్యవసాయ పొలంలోకి గేదెలు వెళ్లాయని ఆమెతో అకారణంగా దూషణకు పాల్పడ్డాడు. వారించేందుకు ప్రయత్నం చేసే క్రమంలో సహనం కోల్పోయి లక్ష్మి ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి అసభ్యపదజాలంచ కులం పేరుతో దూషించాడు. దాడి చేసిన క్రమంలో సదరు మహిళ పళ్లు ఊడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే బుధవారం బాధితురాలి భర్త నర్సింహులు ఫిర్యాదు మేరకు శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
నిందితుడిపై చర్యలు తీసుకోవాలి
దళిత మహిళ లక్ష్మిపై విష్ణువర్ధన్రెడ్డి దాడి చేయడం హేయమైన చర్య అని కుల సంఘాల నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మాచర్ల ప్రకాష్ అన్నారు. గతంలోనూ అదే గ్రామానికి చెందిన పలువురితో ఇలాంటి ఘటనలు, పంచాయితీలు జరిగినట్లు పేర్కొన్నారు. అంతకుముందు బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రభుత్వం మహిళ కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
చిన్నారిపై కుక్క దాడి
వీపగనండ్ల: మండల కేంద్రంలో దీపిక అనే చిన్నారిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తూంకుంట గ్రామానికి చెందిన కడతల విజయ్, నాగమణి దంపతుల కుమార్తె దీపిక వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన వీపనగండ్లకు వచ్చింది. బుధవారం ఇంటి ఆవరణలో తోటి చిన్నారులతో ఆటకుంటుండగా.. సమీపంలోని కుక్క దాడి చేయడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత చిన్నారికి స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద అధికమైందని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.