
నిలిచిన సహాయక చర్యలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం లోపల సహాయక చర్యలు నిలిచిపోయాయి. మొదట్లో 12 బృందాలకు చెందిన 800 మంది సిబ్బంది తవ్వకాల్లో పాల్గొనగా మంగళవారం హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు చెందిన 55 మంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. కానీ వీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనలేదు. నిషేధిత 43 మీటర్ల ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది నిరాకరించడంతో తాత్కాలికంగా పనులు నిలిపి వేశారు. సాంకేతిక కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పనులు చేపట్టాలా.. వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. ప్రమాద ప్రదేశం సొరంగం లోపల నుంచి ఎస్కవేటర్లు, జెట్ మోటార్లు, ఇతర మిషన్లు, మెకానిక్ సామగ్రిని సొరంగం బయటకు తరలించారు.
ఆరుగురి జాడ కోసం..
సొరంగం లోపల పైకప్పు కూలిన ఘటనలో ఎమిమిది మంది కార్మికులు చిక్కుకోగా సహాయక సిబ్బంది ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన ఆరుగురి కోసం 66 రోజులుగా శ్రమించినా జాడ లభించలేదు. నిషేధిత ప్రదేశంలోని టీబీఎం క్యాబిన్లో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన 43 మీటర్ల ప్రదేశాన్ని అత్యంత ప్రమాద ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రదేశంలో మాత్రమే పనులు చేయాల్సి ఉంది. నిషేధిత ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్లు కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్ఐ అధికారులు నిర్ధారించడంతో అక్కడ పనులు నిలిపివేశారు. జాగ్రత్తగా పనులు చేసే అవకాశం ఉందని భావించి డీ1 నిషేధిత ప్రదేశంలో రెండురోజుల పాటు 10 మీటర్ల వరకు సహాయక చర్యలు కొనసాగించారు. ఒక వైపు పైభాగంలో ఉన్న సెగ్మెంట్ బ్లాక్ల లిఫ్టింగ్ క్రేన్ ప్లాట్ఫాంను పూర్తిగా తొలగించారు. టీబీఎం మిషన్ ప్లాట్ఫాం కొంతభాగం కట్ చేయాల్సిన పనులు మిగిలిపోయాయి. ఈ పనులు చేపడుతున్న క్రమంలో సాంకేతిక కమిటీ సూచనల మేరకు మంగళవారం నుంచి సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి.
66 రోజుల తర్వాత ఎస్ఎల్బీసీకి విరామం
ఇప్పటికీ దొరకని ఆరుగురి ఆచూకీ