
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
హన్మకొండ: టీపీసీసీ త్వరలో చేపట్టనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా సంస్థాగతంగా నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ పదవుల్లో బీసీలకు సరైన వాటా కల్పించాలన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 17 డీసీసీ అధ్యక్ష పదవులు, వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల్లో 3 డీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించి మాట నిలుపుకోవాలని ఏఐసీసీ, టీపీసీసీని కోరారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కమిటీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కోశాధికారిగా ఎస్.కిరణ్కుమార్గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది.
అనుమానాస్పద స్థితిలో అంగన్వాడీ టీచర్ మృతి
మహబూబాబాద్ రూరల్ : ఓ అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బెస్తబజారు ప్రాంతంలో నివాసం ఉండే బానోత్ మాధవి (42) జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తోంది. భర్త కృపాకర్ చాలా కాలం క్రితం మృతిచెందగా ఆమెకు కుమార్తె షారోనిదీప్తి ఉంది. ప్రతీ ఆదివారం తల్లీకుమార్తెలు చర్చికి వెళ్తారు. ఆదివారం ఉదయం కూడా కుమార్తె యథావిధిగా చర్చికి వెళ్లింది. మధ్యాహ్నం తల్లి మాధవికి ఫోన్ చేస్తే ఆమె నుంచి ఎలాంటి స్పందనరాలేదు. మూడు గంటల తర్వాత కుమార్తె ఇంటికి వచ్చి చూడగా తల్లి ఉరేసుకుని కనిపించింది. దీనిపై టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డికి సమాచారం ఇవ్వగా టౌన్ ఎస్సై అలీమ్ హుస్సేన్ ఘటనాస్థలికి చేరుకుని మాధవి మృతదేహాన్ని కిందకు దింపారు. మృతురాలు మాధవి శరీరంపై పలుచోట్ల గాయాలుండగా తన తల్లి మృతిపై తనకు అనుమానం ఉందని కుమార్తె షారోనిదీప్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి