
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 72 నెట్వర్క్ హాస్పిటల్స్
గీసుకొండ: పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సగం ఆస్పత్రుల్లో నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల వారు సేవలు నిలిపివేశారు. ప్రభుత్వం తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉదయ్కుమార్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 72 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా వాటిలో 34 ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేసినట్లు వాటి యాజమాన్యాలు చెబుతున్నాయి. మిగతా ఆస్పత్రుల్లో సేవలు కొనసాగుతున్నాయని, సేవలను నిలిపివేసిన యాజమాన్యాలకు నచ్చజెబుతున్నామని ఆరోగ్యశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ స్వరూప్ తెలిపారు. అయితే, ఉమ్మడి జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఎంత బకాయి ఉందనేది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పోర్టల్లో కనిపించడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రులు, ట్రస్ట్ మధ్యనే ఈ లెక్కల వివరాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో నెట్వర్క్ ఆస్రత్రులకు ప్రతీ రోజు సుమారు 2,500 వరకు రోగులు పరీక్షలు చేయించుకోవడానికి వస్తుంటారని, వారిలో సుమారు 180 మంది వరకు చికిత్స, ఆపరేషన్లు చేయించుకోవడానికి జాయిన్ అవుతారని తెలుస్తోంది. గత ఏడాది మార్చి నెల నుంచి తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆస్పత్రుల వారు అంటున్నారు. తాము భరించలేని విధంగా ఖర్చులు పెరుగుతుండటంతో తప్పని పరిస్థితిలో సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని ఆస్పత్రుల వారు సేవలను నిలిపివేయడంతో ఫాదర్ కొలంబో, ప్రతిమ, ఎంజీఎం, కేఎంసీలోని ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగే, సేవలు కొన్ని రోజులపాటు కొనసాగితే రోగులకు ఇబ్బంది తప్పేలా లేదు. ఈ విషయమై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులు
జిల్లా పేరు నెట్వర్క్ సేవలు
ఆస్పత్రులు నిలిపివేసినవి
హనుమకొండ 45 21
వరంగల్ 14 10
జనగామ 4 0
మహబూబాబాద్ 7 2
భూపాలపల్లి 2 1
ములుగు 0 0
మొత్తం 72 34
వాటిలో 34 ఆస్పత్రుల్లో నిలిచిన సేవలు
ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటున్న యాజమాన్యాలు
ప్రతీ రోజు సుమారు 2,500 మంది రోగులకు ట్రస్ట్ వైద్యం

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు