పట్టువదలని కార్మికులు .. | - | Sakshi
Sakshi News home page

పట్టువదలని కార్మికులు ..

Aug 7 2025 9:42 AM | Updated on Aug 7 2025 9:42 AM

పట్టు

పట్టువదలని కార్మికులు ..

జనగామ: పట్టు చీర.. మహిళలు అమితంగా ఇష్టపడే వస్త్రం. చూడడానికి హుందాగా, అందంగా కని పించే చీర. వివాహాది, ఇతర శుభకార్యాల్లో కట్టుకోవడానికి మగువలు అత్యంత ఇష్టపడే చీర. అందుకే వస్త్ర ప్రపంచంలో పట్టుచీర మకుటం లేని మహారాణి. అయితే ఆ చీర తయారీ వెనుక నేతకార్మికుల కష్టం వెలకట్ట లేనిది. పట్టుదారం నుంచి రంగులు అద్దే వరకు చేతి వేళ్లనే ఆడిస్తూ అందమైన చీరను తయారు చేస్తున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పట్టు చీరలకు స్వర్గధామమైన పోచంపల్లి తర్వాత జనగామకు ప్రత్యేక స్థానం ఉంది. నేతకార్మికులు రోజుకు వెయ్యి పట్టు చీరలు తయారు చేస్తూ ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే 30 నుంచి 45 రోజుల్లో ఎనిమిది చీరలు నేసే నేత కార్మికులకు పావలా లాభం వస్తే, రిటైల్‌ మార్కెట్‌లో వ్యాపారులు వేల రూపాయలు అర్జిస్తున్నారు. ఫలితంగా నేత కార్మికులు మాత్రం ఇంకా పూటగడవని స్థితిలోనే జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వాలు సాయం చేసినా, చేయకున్నా దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) జాతీయ చేనేత దినో త్సవం. ఈ సందర్భంగా జిల్లాలో నేత కార్మికుల వివరాలు, సొసైటీలు, మరమగ్గాలు, ప్రభుత్వం సా యం, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఉమ్మడి వరంగల్‌లో

బచ్చన్నపేటలోనే మొదటి మగ్గం..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో 1970–71 సంవత్సరంలో మొట్టమొదటి మగ్గం ప్రారంభించారు. నేత కార్మికులు రెండు నెలల పాటు మగ్గం నేస్తూ ఎనిమిది చీరల(వార్పు)ను తయారు చేసేవారు. ఒక్కో చీరకు రూ.20 లాభం తీసుకుని రూ.120కి పోచంపల్లికి చెందిన హోల్‌సేల్‌ వ్యాపారు లకు అమ్ముకునే వారు. అప్పటి వరకు వివిధ రంగాల్లో పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కార్మికులు మగ్గం బాటపట్టారు. బచ్చన్నపేటలో మొదలైన పట్టుచీర తయారీ మండలంలోని అనేక గ్రామాలకు విస్తరించింది. ఏడాది తర్వాత జనగామలోని వీవర్స్‌ కాలనీ, లింగాలఘణపురం మండలం వడిచర్ల, కొత్తపల్లి తదితర మండలాల పరిధిలో మగ్గాలతో పట్టు చీరలు తయారు చేయడం మొదలు పెట్టారు.

జనగామ జిల్లాలో 11 సొసైటీలు..

అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం జనగామ జిల్లాలో 11 సొసైటీలుండగా, 3వేల మంది నేత, అనుబంధ కార్మికులు, 17 వందల మగ్గాలు, 450 పవర్‌ లూమ్స్‌ ఉన్నాయి. జిల్లాలో నెలవారీగా 15 నుంచి 17 వందల వరకు సెమికతాన్‌, రాజ్‌కోట్‌, పాట్లిపళ్లు, రాజ్‌కోట్‌పేటి, బార్డర్‌ సాదా, బార్డర్‌డిజైన్‌, కాటన్‌ తదితర డిజైన్లకు సంబంధించి పట్టు చీరలు త యారు చేస్తున్నారు. రూ.5,500 నుంచి రూ.13వేల వరకు హోల్‌సేల్‌ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు.

రుణమాఫీకి నోచుకోని

నేత కార్మికులు..

ప్రభుత్వం నేత కార్మికులకు రుణ సాయంతోపాటు నేతన్న పొదుపు, బీమా ద్వారా భరోసా కల్పిస్తోంది. జిల్లాలో రుణసాయం కోసం 679 మంది నేత కార్మికుల జాబితాతో జిల్లా కమిటీ అప్రూవల్‌ చేసి ప్రభుత్వానికి పంపించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల రుణమాఫీ హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. అలాగే, చేనేతబంధు పథకం అమలు కూడా అదే పరిస్థి నెలకొనడంతో కార్మికులకు ఎదురుచూస్తున్నారు.

నేడు జాతీయ చేనేత దినోత్సవం

దశాబ్దాలుగా కులవృత్తిని నమ్ముకుంటున్న నేత కార్మికులు

పోచంపల్లి తర్వాత

పట్టు చీరకు నిలయం జనగామ

ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు

ఎగుమతి

బచ్చన్నపేటలో మొదలైన ‘మగ్గం’ చప్పుళ్లు

జనగామ జిల్లాలో నేత కార్మికుడి ఇంట్లో, షోరూంలలో పట్టు చీరల ధరలు

నేత కార్మికుడి ఇంట్లో షోరూంలో..

సెమికతాన్‌ రూ.5,500 రూ.8,000

రాజ్‌కోట్‌ రూ.8,500 రూ.10,500

పాట్లిపళ్లు రూ.9,000 రూ.14,000

రాజ్‌కోట్‌పేటి రూ.9,000 రూ.16,000

బార్డర్‌ సాదా రూ.5,000 రూ.7,000

పట్టువదలని కార్మికులు .. 1
1/1

పట్టువదలని కార్మికులు ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement