
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
రాయల్టీ, లీజు తదితర
బకాయిదారులపై దృష్టి
● లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన
● ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు
● ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు
● ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపు
మెటల్ క్రషర్ (ఫైల్)
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
అక్రమాలకు ఇక అడ్డుకట్ట..
ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నా యి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తు న్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.ఐదు లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మా రుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రా తి ఖనిజం కంకర,గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరి నా.. ఇంకా గ్రానైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీగా లీజు అగ్రిమెంట్లు పరిశీలి స్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది.
మొదట ఏడు క్వారీలు..
ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు.